Interim Bail for Radhakishan Rao : మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం రాత్రి రాధాకిషన్ రావు తల్లి మృతి చెందింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. రేపు సాయంత్రం 6 గంటల వరకూ రాధాకిషన్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది.
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆయన.. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అవన్నీ చేశామన్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే భవ్య సిమెంట్ ఓనర్ ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు చెప్పారు. మరోవైపు దుబ్బాక ఎన్నికల సమయంలోనూ రఘునందన్ రావు, బంధువుల నుంచి కోటిరూపాయలు సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
మునుగోడు బైపోల్ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు సీజ్ చేశామన్నారు. ప్రణీత్ రావు సమాచారంతోనే ఆ నగదునంతా సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు.
ఇటీవల.. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆ పెద్ద.. మాజీ సీఎం కేసీఆరేనన్న విషయం బట్టబయలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను తెలుసుకునేందుకు ఆయనే అందరి ఫోన్లను ట్యాప్ చేయించారన్న విషయాన్ని ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. 56 మంది ఎస్ఓటీ సిబ్బందితో 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ట్యాపింగ్ ఆపివేయాలని ప్రభాకర్ రావు.. ప్రణీత్ రావు, భుజంగరావులను ఆదేశించడంతో ఫోన్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లు అంగీకరించారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఫోన్ ట్యాపింగ్ చేయడం ప్రారంభించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆ ఆధారాలన్నింటినీ బేగంపేట నాలాలో పడేసి.. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చినట్లు తెలిపారు. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా.. జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో భారీ ప్రకంపనలు సృష్టించింది.