Global Warming: ప్రపంచ దేశాలన్నీ భూతాపాన్ని తగ్గించాలని చాలా సార్లు భేటీ అయ్యాయి. ఎప్పటికప్పుడు టార్గెట్లు పెట్టుకుని వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ, చాలా వరకు ఈ టార్గెట్లు పూర్తి చేయవు. కానీ, ఉజ్వల భవిష్యత్ కోసం పర్యావరణ పరిరక్షణ చాలా అసవరం, భూతాపాన్ని అదుపులో పెడితేనే ఇది సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా గాలి, నీరు, భూమి, కలుషితమవుతున్నందున ఓ వైపు వేడిగాలులు, మరోవైపు తుఫానులు, వరదలు వస్తున్నాయని ప్రఖ్యాత ఇంజినీర్ జి కొండల్ రావు అన్నారు. కరువు, కార్చిచ్చులు, భూకంపాలు మరికొన్ని ప్రదేశాల్లో వస్తున్నాయని వివరించారు. అడవుల నరికివేత, గ్రీన్ హౌజ్ గ్యాస్లు పెరిగిపోవడం వంటివన్ని కూడా గ్లోబల్ వార్మింగ్ సంకేతాలని తెలిపారు. ఈ కాలుష్యాన్ని అరికట్టకపోతే రేపు అనేది ఉండదని హెచ్చరించారు.
గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో సెంటర్ ఫర్ క్లైమేట్ ఛేంజ్ ఏర్పాటు చేసిన కాలుష్య రహిత వాతావరణం కోసం నూతన సదుపాయాల కల్పనపై గురువారం జరిగిన వర్క్ షాప్లో కొండల్ రావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు, అధికారులు, ఇంజనీర్ ప్రముఖులు హాజరైన ఈ సమావేశంలో వాతావరణ మార్పుల కోసం వినూత్న సాంకేతిక విధానాలు – కేస్ స్టడీస్ మరియు ఉత్తమ పద్ధతుల మీద ప్రసంగించారు. ప్రపంచ దేశాలు వాతావరణ విధ్వంసాన్ని అరికట్టాలన్నారు. 1757 నుండే వాతావరణ విధ్వసం మొదలైందని, గత రెండు వందల ఏళ్లల్లో అధిక మొత్తంలో పారిశ్రామీకీకరణ, అడవుల నరికివేత, వాహనాల కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగిపోయిందని, భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మరింత భీకరంగా సంభవించే ముప్పు నుండి అరికట్టడానికి వినూత్న సాంకేతిక విధానాలు అవసరమన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలుకొసం భారతదేశంతో సహ ప్రతి దేశం కృషి చేస్తున్నప్పటికీ సింగపూర్ లాంటి ప్రకృతి పర్యావరణ దేశాన్ని నిర్మించలేకపోతున్నారన్నారు. భారత్లో 54 శాతం ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, 2050 వరకు వాటర్ స్ట్రెస్ బాగా ఏర్పడుతుందని, కాలుష్యం బారిన పడిన గంగా, యమున, కృష్ణా తదితర నదుల పునరుద్ధరణతో పాటుగా పర్యావరణ వ్యవస్థ నిర్వహణ, నీటి సంరక్షణ కోసం పటిష్టమైన ప్రణాళికలు అవసరమని అన్నారు.
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీలో విభేదాలు.. రాష్ట్ర అధ్యక్ష పదవికి.. కొత్త నేతలకు అర్హత లేదా..?
కార్యక్రమానికి హాజరైన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఐఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ మార్పులను సవాలుగా స్వీకరించే విధంగా ఇంజనీర్లు సిద్ధంగా వుండాలన్నారు. శ్రీశైలం డ్యామ్లో సామర్థ్యం కన్నా ఎక్కువ వరద రావడం, క్లౌడ్ బరస్టింగ్ వలన మెరుపు వరదలతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగడం, ఇటీవలి వయనాడ్ వరదలు మొదలైనవి వాతావరణ మార్పులతో వస్తున్నాయని, ఇంజనీర్లకు పెను సవాలుగా మారుతున్న వీటిపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని, ఇందుకోసం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఈ నెల 31న ఇంజనీర్స్ మరియు ఇతర రంగాల్లో వున్న మేధావులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.
కాంక్రీటు నిర్మాణాల వలన పెరుగుతున్న వాతావరణం చర్యలు మరియు నివారణల పై ఐఐటి ప్రొఫెసర్ కెవిఎల్ సుబ్రమణ్యం, సాంకేతిక విధానాల ద్వారా వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం పై జెఎన్టియు ప్రొఫెసర్ విజయ లక్ష్మి మాట్లాడారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణీకరణ వలన ఉత్పన్నమయ్యే అనేక ప్రజా సమస్యలపై తమ కాలేజ్ ద్వారా మేధావి వర్గంతో కూడిన అనేక సమావేశాలు ఏర్పాటుచేశామని, వారి సూచనలను, సలహాలను ఎప్పటికపుడు ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు.
సమావేశానికి చేయూత ఇచ్చిన శ్రీ టి.ఏం.టి టెక్నికల్ మార్కెటింగ్ హెడ్ రాజీవ్ బిస్త్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపే పర్యావరణ నష్టాలను తగ్గించాలంటే యువతరం తమ ఆలోచన విధానానికి పదును పెట్టాలన్నారు. కార్యక్రమానికి సెంటర్ ఫర్ క్త్లెమేట్ చేంజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ డాక్టర్ చంద్రకళ, డాక్టర్ నరేశ్ లు అంకార్స్ గా నిర్వహించారు.