Cock Fight : తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి హడావిడి కొనసాగుతుంది. కోడి పందాలు, పేకాటలు, గుండాటలు, నెంబర్ గేమ్లు అంటూ పందెం రాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఈ క్రమం లోనే గడిచిన రెండు రోజుల్లో గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల చేతులు మారాయి. పేకాట, గుండాటలో సైతం కోట్లలో బెట్టింగులు పెట్టారు. ఇక ఈరోజు పండుగ చివరి రోజు కావడంతో.. ఇవాళ కూడా కోట్లలో బెట్టింగ్ లు జరుగుతాయని భావిస్తున్నారు.
మరోవైపు బరుల వద్ద హైటెక్ హంగులతో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. పందాలకు ఉత్సవాలను తలపించేలా ఎల్ఈడీ స్క్రీన్లు, యాంకర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. అలానే కోడిపందాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు, మద్యం, తినుబండారాల స్టాల్స్ విరివిగా కనిపిస్తున్నాయి. ఈ పందెలను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు క్యూ కడుతున్నారు.
ఇక పందాలు చూసేందుకు తరలి వచ్చే జనం కోసం కూడా ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు నిర్వాహకులు. నారాయణపురంలో పందెం బరి దగ్గర వెయ్యి రూపాయల కూపన్ కొంటే లాటరీలో రెండు బైకులు గెలుచుకునే ఆఫర్ ఏర్పాటు చేశారు. దీంతో పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున కూపన్లు కొనుగోలు చేస్తున్నారు. పందెలు చూడడానికి వచ్చేవారికి సైతం టికెట్లు నిర్ణయించి విక్రయిస్తుండటంతో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి.