Etela: లేటెస్ట్ గా మంత్రి కేటీఆర్.. ఈటల రాజేందర్ పై విరుచుకుపడ్డారు. తండ్రిలాంటి కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారని.. అక్రమంగా ఆస్తులు సంపాదించారని.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఇలా చాలామాటలే అన్నారు. మరి, కేటీఆర్ అన్నేసి అంటే.. ఈటల ఊరుకుంటారా? అదే రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
2014లో ఎన్ని ఆస్తులు, 2023లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది తాను కాదని.. కేసీఆరేనని అన్నారు. తాను పార్టీకి రాజీనామా చేసి పోలేదని.. కేసీఆరే పార్టీ నుంచి వెళ్లగొట్టారన్నారు. టికెట్ ఇచ్చిన ఎన్టీఆర్కే కేసీఆర్ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా? అని ఎదురు ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు ఈటల రాజేందర్. అక్రమ కేసులు, నిరుద్యోగ యువత, రైతుల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ పాలనలో యువత, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని.. దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు ఈటల. ఉద్యోగుల జీతాలు, జీపీఎఫ్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ శాఖలపై ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదన్నారు. ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. ఇక, హుజురాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవకపోతే.. ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగిస్తే.. శిలాఫలకాలు పగలకొడతామని హెచ్చరించారు ఈటల.