KCR: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిన్న మాజీ ఈఎన్సీ మురళీధర్పై ప్రశ్నల వర్షం కురిపించింది. కీలక వివరాలను రాబట్టింది. ఈ రోజు(గురువారం) మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ విచారణలో ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్రశ్నలు వేసి సమాచారాన్ని కమిషన్ రాబట్టింది. ఈ విచారణలో నరేందర్ రెడ్డి సంచలన విషయాలను వెల్లడించారు.
ఈ ప్రాజెక్టును డిజైన్ చేసిందెవరని ప్రశ్నించగా.. సెంట్రల్ డిజైన్ రూపొందించిందని, ఇందులో ఎల్ అండ్ టీ ఇంజినీర్లు కూడా ఉన్నారని నరేందర్ రెడ్డి వివరించారు. డిజైన్లో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసిన నరేందర్ రెడ్డి.. మెయింటెనెన్స్ లోపాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు డ్యామేజీ జరిగిందని చెప్పారు.
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి చర్చలకు తనను పిలువలేదని, తాను ఎక్కడా చర్చల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. తాను కన్స్ట్రక్షన్ జరిగిన ప్రాంతానికి వెళ్లలేదని వివరించారు. కన్స్ట్రక్షన్ తన పరిధిలోనిదే కాదని చెప్పారు. లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్, డ్రాయింగ్ తయారు చేశామని తెలిపారు.
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరంలో మీ పాత్ర ఏమిటి?: ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ విషయంలో అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్ రావు, ఉన్నతాధికారులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని నరేందర్ వెల్లడించారు. డిజైన్స్ అనుమతిలో నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా.. గత ప్రభుత్వం ఒత్తిడితోనే డిజైన్స్ అప్రూవల్స్ పై సంతకాలు చేశామని వివరించారు. డిజైన్లు త్వరగా ఆమోదించాలని తమను ఒత్తిడికి గురి చేశారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు ప్రభుత్వ ఒత్తిడిద, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయని చెప్పారు. అప్పటి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో క్వాలిటీ చెక్ సరిగా జరగలేదన్నారు.
సీడబ్ల్యూసీకి పంపిన తర్వాత కూడా డిజైన్లలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని నరేందర్ రెడ్డి తెలిపారు. బ్యారేజీల నిర్వహణ సరిగా లేదని చెప్పిన ఆయన మేడిగడ్డ ఘటన తర్వాత కూడా సరిదిద్దే అవకాశం ఉందని చెప్పారు. తగిన రీతిలో సత్వరమే స్పందించలేదన్నారు.