ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో పాటూ.. హైదరాబాద్ నలుమూలలా మెట్రో విస్తరించేందుకు నిర్ణయించింది. అయితే మంత్రి మండలి తీసుకున్న ఈ నిర్ణయాల సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ మొదలైంది.
TSRTC కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఆర్టీసీలో పని చేస్తున్న 43వేల 373మంది కార్మికులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రోరైలును మరో 415 కిలోమీటర్లకు విస్తరించాలని కేబినెట్ తీర్మానించింది. ఇందుకోసం 60 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.
కేబినెట్ నిర్ణయాలు బాగానే ఉన్నప్పటికీ చెప్పినవన్నీ జరగడానికి నిధులెక్కడి నుంచి వస్తాయన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో మునిగిన కేసీఆర్ సర్కారుకు తాజా నిర్ణయాలు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాల్సిందే.
రాష్ట్రంలోని సుమారు 65లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ కూడా ఇచ్చింది. ఇందుకోసం 27వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా కూడా వేసి.. ప్రతీ బడ్జెట్ లో కేటాయింపులు ప్రకటించింది. అయితే నిధుల విడుదల జరగకపోవడంతో రుణమాఫీ జరగలేదు. ఎన్నికలకు మరో మూడు నెలల సమయమే ఉండడంతో సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో కీలక ప్రకటన వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.
మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన చేతివృత్తులకు ఆదరణ, దళితబంధు, గృహలక్ష్మీ పథకాలకు సంబంధించిన కేటాయింపులపై కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వరదల కారణంగా దెబ్బతిన్న రైతులకు 5వందల కోట్ల రూపాయలను తక్షణ సాయంగా ప్రకటించారు. కానీ గతేడాదికి సంబంధించిన పరిహారమే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఇవ్వలేదన్న విమర్శలున్నాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కత్తిమీద సాముగా మారిందన్న ఆరోపణలున్నాయి. ప్రతీ నెల పదో తేదీ దాటితే తప్ప.. జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.