తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నవంబర్ 10 వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 15న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ పేర్కొన్నారు.
తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికల బృందం పర్యటించి, స్థానిక అధికారులు, పార్టీల నేతలతో ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపామని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకోసం 6 నెలలుగా కసరత్తు చేస్తున్నామని, వీటిపై వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని తెలిపారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 679 అసెంబ్లీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మిజోరాంలో 8.52 లక్షలు, చత్తీస్ గఢ్ లో 2.03 కోట్ల మంది, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్లు, రాజస్థాన్ లో 5.25 కోట్లు, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ వివరించారు.
మొత్తం 3 కోట్ల 17 లక్షల ఓటర్లు..
తెలంగాణలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు ఒక కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉండగా.. మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43వేల 339 మంది ఉన్నారు. అలాగే ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 17,01,087 మంది కొత్తగా ఓటును నమోదు చేసుకున్నారు. తెలంగాణ ఓటర్ లిస్టులో 18-19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 8 లక్షల 11 వేల 640 మంది ఉన్నారు. అంటే జనవరి 5వ తేదీ నాటికంటే.. సెప్టెంబరుకు 5,32,990 మంది కొత్త ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకున్నారు. కాగా.. 6 లక్షల 10 వేల 694 మంది మరణించిన ఓటర్లను తొలగించగా.. 5 లక్షల 80 వేల 208 మంది ఓటర్లకు ఇంటి నంబర్లలో సవరణలు చేశారు.
తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు. వీటిలో 27,798 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం 72 వేల బ్యాలెట్ యూనిట్లు, 57 వేల కంట్రోల్ యూనిట్లు, 56 వేల వీవీ ప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు వివరించారు.
కాగా.. మిజోరాంకు చివరిగా 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా.. ఈ ఏడాది డిసెంబర్ 17వ తేదీనాటికి ప్రభుత్వం గడువు తీరనుంది. అలాగే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీలకు 2024 జనవరిలో వేర్వేరు తేదీల్లో గడువు ముగియనుంది. ఇటీవలే కేంద్రం జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకురాగా.. అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం ఇప్పట్లో సాధ్యం కాదన్న వాదన వినిపించింది. దాంతో కేంద్రం జమిలి ఎన్నికలపై వెనక్కి తగ్గింది. ఒక్కో అసెంబ్లీ గడువు వేర్వేరు తేదీల్లో ముగియనున్నప్పటికీ.. తొలుత ఐదు రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు కూడా జరగనుండగా.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. అందుకే వీటిని జాతీయ, ప్రాంతీయ పార్టీలు సైమీ ఫైనల్ గా భావిస్తున్నాయి.