తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్ర 5 గంటలకు మైకులు బంద్ అయ్యాయి. పార్టీలన్నీ ప్రచారానికి గుడ్ బై చెప్పి.. పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టిపెట్టాయి. తెలంగాణలోని
13 సమస్యాత్మక నియోజకవర్గాల్లోసాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగిసింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలో గంట ముందే ప్రచారం ముగిసింది.
తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. నవంబర్ 30న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. అప్పటి వరకు క్యూలైన్ లో ఉన్న వారిని ఓటింగ్ కు అనుమతిస్తారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల కానున్నాయి.
మరోవైపు పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి హైదరాబాద్లో ఆంక్షలు విధించామని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. డిసెంబర్ 1 ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ గుమిగూడటంపై నిషేధం విధించారు. కర్రలు, జెండాలు, తుపాకులు లాంటి ఆయుధాలతో సంచరించడం నిషేధమని స్పష్టం చేశారు.
హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో సమావేశాలు నిర్వహించడం కుదరదన్నారు. ఆ ప్రాంతంలో గుంపుగా సంచరించడంపై నిషేధం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, షామీనాలు వేయడంపై ఆంక్షలు పెట్టారు.