తెలంగాణలో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. ప్రచారానికి ఇక 5 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారంలో జోష్ పెంచింది. కాషాయ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఆర్మూర్ లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేయించి జైలుకు పంపడం ఖాయమన్నారు. కేసీఆర్ కు డబ్బులు ఎవరు ఇస్తారో వారికే మంత్రి పదవులు ఇస్తారని ఆరోపించారు.
ఇచ్చిన ఏ హామీని బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదన్నారు అమిత్ షా. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోనూ అమిత్ షా రోడ్ షోలు నిర్వహించారు. శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు.
మరో కాషాయ అగ్రనేత, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హైదరాబాద్ లో ప్రచారం చేపట్టారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ ప్రజలకు అనేక హామీలిచ్చినా.. నెరవేర్చలేదన్నారు. 27 ఏళ్లుగా గుజరాత్ను దేశంలోనే మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయలేదని కేసీఆర్ను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.నాటి ప్రధాని వాజ్పేయీ నుంచి నేటి పీఎం మోదీ వరకు బీజేపీ ప్రభుత్వాలపై అవినీతి మచ్చ లేదని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.