MallaReddy: పాలమ్మిన.. పూలమ్మిన. మంత్రి మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్. మరి నిజంగానే మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్మి పైకొచ్చారా? అలా సంపాదించే మెడికల్ కాలేజీలు కట్టారా? మొన్నటికిమొన్న ఆయన కాలేజీలు, వ్యాపార సముదాయాల్లో ఐటీ రైడ్స్ అయినప్పుడు ఎంతగా అలజడి రేగిందో తెలిసిందే. రెండు రోజుల పాటు.. మంత్రికి కునుకు కూడా పట్టలేదు. అదే సందర్భంలో తన దగ్గరేమి పట్టుబడలేదని.. తాను కష్టపడి పైకొచ్చానంటూ.. పాలు పూలు అమ్మానంటూ డైలాగులు చెప్పుకొచ్చారు.
ఈ సారి ఈడీ రైడ్స్ జరిగాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు బ్లాక్ చేశారన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగిన సోదాలపై ఈడీ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేసింది. మంత్రి మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీలో లెక్కల్లో చూపని కోటి 40 లక్షల నగదును సీజ్ చేశామని తెలిపింది. అలాగే కాలేజీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో.. 2 కోట్ల 89 లక్షల నగదును సీజ్ చేసినట్టు ప్రకటించింది. నగదుతో పాటు హార్డ్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు, పలు ఫైల్స్ ఈడీ స్వాధీనం చేసుకుంది.
అటు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. వరంగల్ పీజీ మెడికల్ సీట్స్ స్కామ్పై కేసు నమోదు చేశారు. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ఇద్దరు మంత్రులకు చెందిన మమత, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు జరిపి.. ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటనలో తెలిపింది.