ED: ఇటీవల రెగ్యులర్ గా ఈడీ, ఐటీ, సీబీఐ న్యూస్ లే. అక్కడ దాడులు, ఇక్కడ సోదాలు.. అంటూ వరుస హడావుడి. ఢిల్లీ లిక్కర్ స్కాంతో మొదలైంది. మంత్రులు గంగుల, మల్లారెడ్డి, తలసాని బ్రదర్స్ లతో పీక్స్ కు చేరింది. ఇంతటి పొలిటికల్ హంగామా మధ్య.. సినిమా వాళ్లనూ వదలలేదు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. అయితే, ఆ సినిమా కేసులోనూ ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని తెలుస్తుండటం ఆసక్తికరం.
లైగర్. పూరి-విజయ్ కాంబినేషన్లో వచ్చిన డిజాస్టర్. ఆ సినిమా నిండా ముంచింది. లైగర్ ను జనం మర్చిపోయినా.. ఈడీ రూపంలో మూవీ టీమ్ కు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకు కారణం.. లైగర్ లోకి దుబాయ్ నుంచి పెట్టుబడులు వచ్చాయనే అనుమానం. ఇప్పటికే పూరి జగన్నాథ్, చార్మిలను ప్రశ్నించిన ఈడీ.. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండను ఎంక్వైరీ చేసింది. లైగర్ నిధుల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించింది.
లైగర్ లో ఓ రాజకీయ నేత పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇండియా నుంచి దుబాయ్ కి డబ్బులు పంపించి.. మళ్లీ దుబాయ్ నుంచి వైట్ మనీ రూపంలో తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మొత్తం హవాలా దందాలో ఓ రాజకీయ నేత ప్రమేయం ఉందని డౌట్. ఆ లీడర్ ఎవరో తేల్చడానికి, దుబాయ్ నిధుల మనీ లాండరింగ్ గుట్టు రట్టు చేయడానికి ఈడీ.. పూరి, ఛార్మి, విజయ్ లను వరుసగా ఎంక్వైరీ చేస్తోంది. మరి, ఆ రాజకీయ నేత ఎవరో తేల్చారా? కాంగ్రెస్ నేత జడ్సన్ ఆరోపించినట్టు ఆమె కవితనేనా?