కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు.. బీఆర్ఎస్ నాయకులకు డబ్బు తరలిస్తున్న స్పాట్కు స్పాట్ పెట్టారు కాంగ్రెస్ నాయకులు. రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో ఈసీ సోదాలు జరుపుతోంది. ఆయన ఇంటి నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బు కట్టలు వెళ్తున్నాయంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఈసీ అధికారులు కదిలారు. పోలీసులు కూడా పెద్దసంఖ్యలో మోహరించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో 300 కోట్ల రూపాయల మనీ డంప్ ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తాము మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం అధికారులు తీరిగ్గా ఇప్పుడు తనిఖీలకు వచ్చారని వాళ్లు మండిపడుతున్నారు. గోయల్ నివాసంలోకి తమను కూడా పంపించాలని.. తమ ముందే సోదాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోయల్ నివాసం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ఇలా ఏకే గోయల్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఇంట్లో ఈసీ సోదాలు చేసింది. బయట కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు చేస్తున్నారు. గోయల్ ఇంట్లో డబ్బుల డంప్ ఉందని కాంగ్రెస్ నాయకులు బలంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా గోయల్ మెలిగారని.. అందుకే ఆయనపై నమ్మకంతో డబ్బుల పంపిణీ బాధ్యత ఆయనకు అప్పగించారని కాంగ్రెస్ లీడర్ల ఆరోపణ.
స్పాట్ కు మల్లు రవి వెళ్లారు. సోదాల్లో ఏం బయటపడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు. నంబర్ పేట్లు లేని బైకులను బయటకు పంపడంపై అభ్యంతరం తెలిపారు. ఆ బైకుల ద్వారా డబ్బులు తరలించారని అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలని నిలదీస్తే.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ నేత అజారుద్దీన్ మండిపడ్డారు. తాము కంప్లైట్ ఇస్తే.. తమపైనే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఓ మహిళ తనిఖీల సమయంలో బయటకు వచ్చారు. ఆమె తీరు అనేక అనుమాలు వ్యక్తం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. సదరు మహిళ తాను ఫ్లయింగ్ ఆఫీస్ గా చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఐడీ కార్డు అడిగితే చూపించలేదు. నోట్ల కట్టల లోగుట్టు ఆమెకు తెలుసని కాంగ్రెస్ నేతలంటున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలోనూ ఆమె ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడారు.
నోట్ల కట్టల లోగుట్ట వ్యవహారంపై మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫోన్ చేశారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
గోయల్ నివాసానికి ఐటీ అధికారులు వెళ్లారు. తన ఇంట్లో తనిఖీలకు సెర్చ్ వారెంట్ చూపించాలని గోయల్ కోరారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అబ్జర్వులు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు.