తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అక్టోబర్ రెండో వారంలో షెడ్యూల్ను ప్రకటించే యోచనలో ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం త్వరలో రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేయనుంది.
గత ఎన్నికలు తెలంగాణలో గడువుకంటే ముందే జరిగాయి. పార్లమెంట్ ఎన్నికలతోపాటు 2019 ఏప్రిల్ లో జరగాల్సి ఉండాగా క సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో 2018 అక్టోబర్ 6న షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. జనవరి 17న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. రాజస్థాన్ ,ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఇదే గడువు ఉంది. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ 17తోనే ముగియనుంది. తెలంగాణతోపాటు ఆ 4 రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూల్ ప్రకటించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రభుత్వ సెలవులు, స్థానిక పండగల సెలవులపై వివరాలను కేంద్ర ఎన్నికల సేకరించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండగలు వస్తాయి. ఇతర సెలవులు లేవని అధికారులు సమాచారం సేకరించారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ బృందం రెండుసార్లు ఎన్నికలు నిర్వహించబోయే రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. షెడ్యూల్ ప్రకటించటానికి ముందు ఒకసారి, నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మరోసారి ఈ పర్యటనలు ఉంటాయి. ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధత తొలిదశను పరిశీలించింది. మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సాగుతోంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. నవంబర్ 4న తుది ఓటర్ల జాబితాను వెలువరిస్తారు.
డిసెంబర్ లోనే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఈసీ భావిస్తోంది. డిసెంబర్ రెండో వారంలోగా పోలింగ్ ముగించే అవకాశాలున్నాయి. ఎన్నికల పరిశీలకులను నియమించేందుకు అధికారుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిఘాను విస్తృతం చేయాలని ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది. 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను రంగంలోకి దింపనుంది.