Duplicate Medicines : తెలంగాణలో నకిలీ మందుల దందాపై ఉక్కుపాదం మోపింది డ్రగ్స్ కంట్రోల్ శాఖ. కొన్నాళ్లుగా నకిలీ మందులపై ఫోకస్ పెట్టిన అధికారులు వరుస దాడులతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి నకిలీ సరుకు సరఫరా అవుతుందని గుర్తించిన డీఏసీ దాన్ని అరికట్టేందుకు కొరడా ఝుళిపిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లపై గత నెలలుగా ఫోకస్ పెట్టిన అధికారులు నకిలీ మందుల విక్రయాలపై నిఘా పెంచారు.
అడ్డు అదుపులేకుండా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియాకు వార్నింగ్ ఇచ్చారు డ్రగ్స్ కంట్రోల్ డిజి కమల్ హాసన్. కేంద్రం విధించిన ధరలతో మాత్రమే మందులను మెడికల్ షాపులు విక్రయించాలని ఆదేశించిన ఆయన.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందించడం తమ బాధ్యత అని డ్రగ్స్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత 6 నెలల నుంచి నకిలీ మందులపై నిఘా పెంచామని.. ఇందులో భాగంగానే వరుస దాడులు నిర్వహించి నకిలీ మెడిసిన్, ఇంజక్షన్స్ సీజ్ చేసామని వెల్లడించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో నకిలీ మందులు తయారు చేసి హైదరాబాద్లో సేల్ చేస్తున్నారని.. ఇతర రాష్ట్రాల నుండి కొరియర్, ఏజెoట్ల ద్వారా హైదరాబాద్కు దిగుమతి చేస్తున్నట్లు డీజీ తెలిపారు .