సీఎం కేసీఆర్ ఏదైనా ఎత్తుగడ వేస్తే అది చివరి వరకూ సస్పెన్స్గానే ఉంచుతారు. అది కొత్త పథకమైనా.. అభ్యర్థుల ఎంపికైనా. అలాంటిది.. బీఆర్ఎస్ తొలి జాబితా ఇదేనంటూ మీడియాలో కొన్నిపేర్లు తెగ ప్రచారం అవుతున్నాయి. అందులో సిట్టింగులకే ఎక్కువ టికెట్లు కేటాయించినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరి పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి.
మిగతా స్థానాలపై పెద్దగా కిరికిరి లేకపోయినా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పేర్లపైనే రచ్చ నడుస్తోంది. తొలి జాబితాలో మూడు నియోజకవర్గాల్లో సిట్టింగులకు షాక్ తగిలేలా ఉందా లిస్ట్. ఇటీవల కాంట్రవర్సీగా మారిన స్టేషన్ ఘన్పూర్, జనగామలో సిట్టింగుల పేర్లు లేవు. ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, జనగామ నుంచి ముత్తిరెడ్డికి బదులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇక వరంగల్ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కు కాకుండా.. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి.. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర పేరు ఉంది.
ఇక్కడే అది ఫేక్ జాబితానా అనే అనుమానం కలగజేస్తోంది. వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నరేందర్.. పక్కా మాస్ లీడర్. ఈసారి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచే కొండా దంపతులను ఫేస్ చేయగల సత్తా ఉన్న నాయకుడు. అలాంటిది నరేందర్ను కాదని.. సాఫ్ట్ లీడర్ రవిచంద్రకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తారా? అందులోనూ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా చాలా గడువే ఉంది. ఎంపీగా ఉన్నాక కూడా అసెంబ్లీ బరిలో ఎందుకు నిలుపుతారు? అనే అనుమానం.
మరోవైపు, తొలి జాబితాలో వివాదాస్పదంగా మారిన మూడు స్థానాలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనివే కావడం మరో డౌట్. కొంతకాలంగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాగా వివాదాస్పదమయ్యారు. చిలిపి చేష్టలతో ఇజ్జత్ తీసుకున్నారు. అందుకే ఈసారి ఆయనకు టికెట్ ఫసక్ అని ప్రచారం జరుగుతోంది.
అటు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం భూకబ్జాలు, కూతురుతో కలహాలతో కాంట్రవర్సీగా మారారు. పల్లా రాజేశ్వర్రెడ్డితో టికెట్ పోరు సాగుతోంది. స్థానిక బీఆర్ఎస్ లీడర్లు గ్రూపులు కట్టి.. రాజకీయాన్ని రంజుగా మార్చారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ తొలి జాబితా అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం.. అందులో వరంగల్ జిల్లాలోని మూడు స్థానాలపైనే కిరికిరి నడుస్తుండటంతో.. ఇదంతా అక్కడి వారే క్రియేట్ చేసిన ఫేక్ ప్రచారమనే అనుమానం వ్యక్తం అవుతోంది. సీఎం కేసీఆర్ టేబుల్పై మాత్రమే ఉండే తొలి జాబితా.. ఇలా బయటకు వచ్చే ఛాన్స్ లేనే లేదని.. ప్రగతిభవన్ మేటర్స్ కొంచెం కూడా బయటకు వచ్చే ఛాన్సే లేదని.. చెబుతున్నారు. అయితే ఇది పక్కా ఫేక్ న్యూస్ అయినా కావాలి.. లేదంటే కేసీఆర్ కావాలని లీక్ అయినా చేయించాలని అంటున్నారు.