Double Decker Buses : హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెకర్ బస్సులు సందడి చేస్తున్నాయి. తాజాగా 3 బస్సులను అవుటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్ కార్యాలయం వద్ద ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. అందులో ఒకటి ఓపెన్ టాప్ బస్సు కావడం విశేషం. బస్సులో 65 సీట్లు ఉంటాయి. బస్సు పొడవు 9.8 మీటర్లు. ఎత్తు 4.7 మీటర్లు. ఈ బస్సులు ఆధునిక సౌకర్యాలతో ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
బ్యాటరీ రెండున్నర గంటలపాటు ఛార్జింగ్ చేస్తే.. ఈ బస్సులో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ తొలి విడతలో 6 బస్సులను కొనుగోలు చేసింది. అందులో 3 బస్సులను ఇప్పుడు ప్రారంభించారు. త్వరలో మరో మూడు బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 20 బస్సులు కొనుకోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.2.16 కోట్లు . బస్సుల నిర్వహణ బాధ్యత ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఏడేళ్లపాటు ఆ సంస్థే బస్సు నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది.
నిజాం కాలం నుంచి 2003 వరకు హైదరాబాద్ లో డబుల్ డెకర్ బస్సులు నడిచేవి. కాలక్రమంలో ఈ సర్వీసులను నిలిపివేశారు. ఇప్పుడు అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేసింగ్ భాగ్యనగరంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ డెకర్ బస్సులను ప్రారంభించారు. ఫిబ్రవరి 11న ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు, ప్యారడైజ్, నిజాం కళాశాల చుట్టూ ఈ బస్సులను నడుపుతారు. ఆ రోజు ఉచితంగానే బస్సులు తిరుగుతాయి. ఈ డబుల్ డెకర్ ఈవీ బస్సులను పర్యాటక సంస్థకు కేటాయించారు. సిటీ టూర్ కోసం ఈ బస్సులను వినియోగిస్తారు. హైదరాబాద్ పర్యాటకులకు ఈ బస్సులు సేవలు అందించనున్నాయి.