Khammam : ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులకు మౌలిక సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. అవి ఊరికి దూరంగా ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లోనే ఉన్నాయి.
పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడం లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నియోజకవర్గం అర్బన్ మండలం మల్లెమడుగు గ్రామ పంచాయతి లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నాసిరకంగా నిర్మించారు. పూర్తి స్థాయిలో పనులు కాకుండానే ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఓటు బ్యాంక్ రాజకీయాన్ని అవలంభించారు.
జూన్ మాసంలో హడావిడిగా లబ్దిదారులను ఎంపిక చేసి ఇళ్లను పంపిణీ చేసారు. నిర్మాణం చేసిన ప్రాంగణంలో కనీస సౌకర్యాలు లేవని లబ్దిదారులు వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ సమీపంలో రెండు పడకల గదులు నిర్మించారు. త్రాగు నీరు , రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమకు కనీస సౌకర్యాలను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.