DK Shiva Kumar : తెలంగాణలో కాంగ్రెస్ దే విజయమని అన్ని సర్వేలు తేల్చాశాయి. ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ అధికార పార్టీ ఓటమి ఒప్పుకోలేక కుయుక్తలు పన్నుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచే ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెంగళూరులో స్పందించిన డీకే.. సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ స్వయంగా సంప్రదించారని కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పారని వెల్లడించారు. కాంగ్రెస్ భారీగా సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదని డీకే తెలిపారు.
మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 సెంటర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 113 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా చేపట్టనున్నారు. 500లకు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల కౌంటింగ్ కోసం 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది.