DK Aruna Chitchat with Media:కేంద్రమంత్రి పదవి కోసం తాను ఎటువంటి లాబీయింగ్ చేయట్లేదని, తనకు పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానంటూ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో మీడియాతో ఆమె చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని ఆమె అన్నారు. రాష్ట్రంలో 14 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు కదా.. ఇప్పుడేమైంది..? అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని.. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైనందుకు సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.
బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారన్నారు. మహబూబ్ నగర్ లో ఓడిపోతే అభివృద్ధి జరగదని చెప్పారని, అక్కడ ఆయనే అభ్యర్థిలా వ్యవహరించారంటూ రేవంత్ రెడ్డిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు… కొందరు నేతలు కర్ణాటక నుంచి వచ్చి ఎన్నికల్లో డబ్బులు పంచారంటూ ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి 10 సీట్లు వస్తాయని అంచనా వేశాం.. కానీ, 8 సీట్లే వచ్చాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతి విలేజ్ కి, ప్రతి ఇంటికి మోదీ అభివృద్ధి నినాదం వెళ్లిందన్నారు. బీజేపీని అడ్డుకునేందుకు రిజర్వేషన్లను తీసేస్తారంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో ఇక్కడి ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించాలంటూ డీకే అరుణ పేర్కొన్నారు.
Also Read: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి
కాగా, దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా, అందులో 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మరో 8 సీట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మిగతా ఒక్క సీటు ఎంఐఎం పార్టీ ఖాతాలో పడింది. మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ సహా 8 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇటు ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు రావడంతో కేంద్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ ఎంపీలు కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారంటూ నేతలు చర్చించుకుంటున్న విషయం తెలిసిందే.