గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసింది.
తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కృష్ణమోహన్ రెడ్డిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇవాళ తీర్పు వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు వెల్లడించింది. గత ఎన్నికల్లో డీకే అరుణపై 28,445 ఓట్లతో గెలిచారాయన.
గత ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు డీకే అరుణ. ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆమె ఎమ్మెల్యే పదవి తిరిగి రానుంది.
అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీలో లేకుండా.. బీజేపీలో ఉన్న అరుణపై మళ్లీ పార్టీ ఫిరాయింపు వేటు పడుతుందా? అనే అనుమానమూ ఉంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తరహాలోనే తప్పుడు అఫిడవిట్ కేసులో గద్వాల ఎమ్మెల్యేపైనా వేటు పడటం ఆసక్తికరంగా మారింది. అయితే, వనమా అప్పీల్కు కోర్టు అనుమతి ఇవ్వడం.. సుప్రీంలో స్టే రావడంతో.. ఆయనే ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి, డీకే అరుణ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
వనమా, అరుణలే కాదు.. మంత్రి శ్రీనివాసగౌడ్తో సహా మరికొందరు ఎమ్మెల్యేలపైనా అనర్హత పిటిషన్లు కోర్టుల్లో నడుస్తున్నాయి. ఆ కేసుల్లోనూ త్వరలోనే తీర్పు రానుండటంతో అనర్హత వేటు పడే ఎమ్మెల్యేల జాబితా మరింత పెరగనుంది.
మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా.. ఇలా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం.. అది అమలైతే ఐదేళ్ల జీతం, అలవెన్సులు వెనక్కి తీసుకోవడం.. రికార్డుల్లోనూ పేరు మారడం.. ఇలా టెక్నికల్గా భారీ డ్యామేజీనే జరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే, ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే పదవి చేతికొచ్చినా.. ఆ పదవిని అనుభవించే సమయం లేకపోవడం నెగటివ్ అంశం.