Rahul Gandhi: సరైన సమయం చూసి గురిచూసి కొట్టింది బీజేపీ. బోయవాడి వేటకు గాయపడిన కోయిలలా రాహుల్ గాంధీ విలవిల్లాడాల్సిన పరిస్థితి. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల పరువునష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడింది. శిక్షను సాకుగా చూపిస్తూ.. రాహుల్ను ఎంపీ పదవికి అనర్హుడిని చేస్తూ వేటు వేసింది లోక్సభ సచివాలయం. కేంద్రం కదిపిన పావుకు.. కాంగ్రెస్కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందనే చెప్పాలి. న్యాయ పోరాటం చేస్తాం అంటూ హస్తం నేతలు సవాళ్లు చేస్తున్నా.. పెద్దగా ప్రయోజనం ఏమీ ఉందకపోవచ్చని అంటున్నారు. ఎందుకుంటే.. ఆ సెక్షన్ అలాంటిది మరి.
ప్రజాప్రాతినిధ్య చట్టం. దీని ప్రకారమే రాహుల్ను రఫ్ఫాడించింది కేంద్రం. రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు. ఇదీ చట్టం. ఆ పాయింట్ మీదే రాహుల్పై వేటు వేశారు. ఈ చట్టంలో మరో కఠిన నిబంధన కూడా ఉంది. అది కూడా అమలు చేస్తే.. రాహుల్గాంధీకి ఇక రాజకీయ సమాధినే అంటున్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్షకాలంతో పాటు.. మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులు అవుతారు. ఇంకా ఈ రూల్ను ప్రయోగించలేదు. అది కూడా అప్లై చేస్తే..? మరో 2+6 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఇదే జరిగితే.. కాంగ్రెస్ యువరాజుకు, పార్టీకి కోలుకోలేని శరాఘాతమే అంటున్నారు.
అయితే, అలాంటిదేమీ జరగకపోవచ్చని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రెండేళ్ల శిక్ష పడిన కేసులో ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్కు 30 రోజుల గడువు ఉందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్ను సంప్రదించకుండా.. లోక్సభ సచివాలయంకు ఇలా నేరుగా వేటు వేసే అధికారం లేదని చెబుతున్నారు. అయితే, ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుంచుతున్నారు కమలనాథులు.
ఎంపీగా రాహుల్ గాంధీపై వేటు వేయడమైతే సంచలన నిర్ణయమే. కాంగ్రెస్కు ఊహించని పరిణామమే. మరి, దీనిపై కాంగ్రెస్ ఎలా పోరాడుతుందో.. బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో.. అనేది మరింత ఆసక్తికరం. రాజకీయంగా కీలకాంశం.