Digital Card for Telangana People: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సీఎల్పీలో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, AICC అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సీఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. PCC అధ్యక్షుడిగా తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని.. అత్యధిక లోక్ సభ సీట్లు గెలిచామని సీఎం అన్నారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.
అటు.. ప్రజల్లో ఉన్న నేతలకే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని PCCకి సూచించారు సీఎం. పార్టీ అనుబంధ విభాగాల్లో నిబద్ధతతో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సమర్థంగా పని చేసినందుకే వారికి పదవులు ఇచ్చామని స్పష్టంచేశారు. పార్టీ లో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామన్నారు. ఈ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రేషన్, కల్యాణలక్ష్మి, ఆరోగ్య శ్రీ వంటి సేవలన్నీ ఈ డిజిటల్ కార్డు ద్వారానే అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Also Read: హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ‘నువ్వు ట్రై చేయవా?’
మరోవైపు.. బీసీ కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన అని సీఎం అన్నారు. ఆయన ఆలోచన మేరకే బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని అన్నారాయన. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే కచ్చితంగా జనాభాను లెక్కించాల్సిందేనని అన్నారాయన. అటు.. ఎస్సీ వర్గీకరణ అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని వెల్లడించారు. ఇక.. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అటు.. దేశంపై నాలుగోసారి పట్టు సాధించేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని.. అందులో భాగంగానే జమిలి ఎన్నికలు తీసుకొస్తున్నారని అన్నారు. అందుకే జమిలి ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్ ఛార్జి మంత్రులు వారానికి రెండు సార్లు జిల్లాల్లో పర్యటించాలని సూచించారు.
ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పీసీసీకి సూచించారు సీఎం రేవంత్. ఇప్పటివరకు పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కచ్చితంగా అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించారు. ప్రధానిని ఓడించాల్సిన తరుణంలో మహేష్ కుమార్గౌడ్ బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాగా.. సీఎల్పీ సమావేశం జరుగుతున్న హోటల్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, కడియం శ్రీహరి వెళ్లడం ఆసక్తిని రేపింది.