Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన విమర్శలకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత కాదు.. 3 నెలల తర్వాత తానే సీఎం అని స్పష్టం చేశారు. అసెంబ్లీ బీఆర్ఎస్ సభలా మారిందని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యుల వాకౌట్ చేశారు.
అంతకుముందు పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి అని పేర్కొన్నారు. తాను చెప్పింది తప్పయితే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలను కోరారు. ఒకవేళ తాను చెప్పింది నిజమైతే విపక్షాలకు డిపాజిట్లు రాకుండా చూడాలని కోరారు.
రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమా ఖర్చుల లెక్కలు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కు బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజల జీవనరేఖ అని తెలిపారు. పేదల సంక్షేమంతోపాటు రాష్ట్రంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మౌలిక వసతులపై 26 శాతం ఖర్చు పెడుతున్నామని వివరించారు. తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత అని స్పష్టం చేశారు. తెలంగాణలో సంక్షేమం.. సంతోషం ఉన్నాయని తప్ప సంక్షోభం లేదన్నారు. కాంగ్రెస్లో మాత్రమే సంక్షోభం ఉందని సెటైర్లు వేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నీళ్ల కోసం రోజుకు ట్యాంకర్ తెచ్చుకుంటున్నామని చెప్పారని అది వాస్తవం కాదని కేటీఆర్ అన్నారు. అందుకే లెక్కలు తెప్పించానని తెలిపారు. డ్యాక్యుమెంటరీ ఆధారాలు కూడా తీసుకొచ్చానని చెప్పారు. బంజారాహిల్స్లో భట్టి ఉంటున్న ఇల్లు రాజేందర్రెడ్డి అనే వ్యక్తి పేరుపై ఉందని వెల్లడించారు. భట్టి బిజీగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో భట్టి ఇంట్లో మీటరు చెడిపోయిందని.. ఈ వివరాలు హెచ్ఎండబ్ల్యూఎస్ వద్ద ఉంటాయని తెలిపారు.
జనవరి 2022 నుంచి మీటర్ పనిచేయడం లేదని.. బాగు చేసుకొని ఉంటే అందరిలాగే ఉచితంగా 20 వేల లీటర్ల నీళ్లు వచ్చేవని సభలో కేటీఆర్ వివరించారు. జనవరి 2022 నుంచి ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదన్నారు. దీనిపై ఆదివారం వివరణ ఇవ్వచ్చని భట్టికి కేటీఆర్ కౌంటరు ఇచ్చారు.
మరోవైపు గవర్నర్ తమిళిసై తిప్పి పంపిన 4 బిల్లులను మంత్రులు మరోసారి మండలిలో ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ చట్ట సవరణ బిల్లు- 2022ను రీ కన్సిడరేషన్ కోసం మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్ మెంట్ బిల్లు -2022 నుంచి సభలో రీ కన్సిడరేషన్ కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు- 2023ను రిఫరెన్స్ కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాసనమండలిలో ప్రవేశ పెట్టారు.