TS Politics: ప్రజాసంగ్రామ యాత్రతో మరింత దూకుడు మీదున్నారు బండి సంజయ్. నిత్యం సీఎం కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసే బీజేపీ చీఫ్.. ఈసారి ఓ మంత్రిపై విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బండి పాదయాత్ర కొనసాగుతుండగా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విమర్శల దాడి చేశారు.
మంత్రి అవినీతి చిట్టా మొత్తం సిద్ధంగా ఉందని.. మున్సిపల్ స్కాంలో తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు బండి సంజయ్. మీడియా ముందు పిచ్చి పిచ్చిగా వాగితే తాటతీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా కలెక్టర్ కూ ఝలక్ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అవినీతికి సహకరించిన కలెక్టర్ సంగతి చూస్తామన్నారు బండి సంజయ్.
బండి వ్యాఖ్యలపై అదే రేంజ్ లో రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. పది రోజులు టైమ్ ఇస్తున్నా.. దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారని.. అసలు బీజేపీ ప్రజలకు ఏమి చేసిందో బండి సంజయ్ చెప్పాలని ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
మరి, మంత్రి సవాల్ ను బండి సంజయ్ స్వీకరిస్తారా? పది రోజుల్లో ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి చిట్టా బయటపెడతారా? ఇలా వారిద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లతో నిర్మల్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి.