Gruha Jyothi Scheme In Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. 200లోపు యూనిట్ల విద్యుత్ వాడకందారులకు జీరో బిల్లులు జారీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 40, 33, 702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేసింది. చాలా పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
రేషన్ కార్డు, ఆధార్ నంబర్, కరెంట్ కనెక్ష వివరాలు సక్రమంగా ఉన్నవారికి ఇప్పటికే జీరో బిల్లులను తెలంగాణ సర్కార్ జారీ చేసింది. అయితే కొంతమంది విద్యుత్ వినియోగదారులు 200లోపే కరెంట్ వాడుకున్నా.. ప్రభుత్వం కోరిన వివరాలు సమర్పించకపోవడంతో వారికి జీరో బిల్లులు జారీ కాలేదు. అలాంటి వారిని లబ్ధిదారుల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
తెల్ల రేషన్ కార్డు ఉండి.. 200 లోపు యూనిట్ల కరెంట్ వాడుకున్న వారికి సాధారణ బిల్లు జారీ అయినా అది చెల్లంచనవసరంలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. వారు మండల పరిషత్ , మున్సిపల్, విద్యుత్ , రెవెన్యూ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డు, ఆధార్ నంబర్, విద్యుత్ కనెక్షన్ వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలని సూచించారు. అన్ని వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లు జారీ అవుతుందని తెలిపారు. ఇప్పటికే 45 వేల మంది రివైజ్డ్ బిల్లులు ఇచ్చామని వెల్లడించారు.
Read More: కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ కమిటీ విచారణ.. ఇంజినీర్ల నుంచి సమాచారం సేకరణ..
మరోవైపు తెలంగాణలో విద్యుత్ వాడకం బాగా పెరిగింది. మార్చి 8న 15, 623 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా మరింత పెంచామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2022 డిసెంబర్ లో రోజూవారి సగటు 200 మిలియన్ యూనిట్లుగా ఉందన్నారు. కానీ 2023 డిసెంబర్ లో రోజువారీ సగటు విద్యుత్ వినియోగం 207.7 యూనిట్లకు పెరిగిందన్నారు. 2023 ఫిబ్రవరిలో 263 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. 2024 ఫిబ్రవరిలో 272 మిలియన్ యూనిట్ల సరఫరా చేశామన్నారు. మార్చిలో రోజూ సగటున 295 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. విద్యుత్ డిమాండ్ 16 వేల 500 మెగావాట్ల కు పెరిగినా సరఫరా చేస్తామన్నారు.
సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నీటిపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా అందించే రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామన్నారు.