Deputy Cm Bhatti Vikramarka : తెలంగాణ నల్ల బంగారు గణుల సిరులవేణి, కార్మికుల కొంగుబంగారం సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు దీపావళి బోనస్ను గతంలోనే ప్రకటించింది. తాజాగా ఇందుకు సంబంధించిన రూ.358 కోట్లను విడుదల చేసింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో రేపు కార్మికుల అకౌంట్లలో జమ చేసేందుకు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.
పండుగ సందర్భంగా ఇస్తున్నాం…
దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ను కానుకగా ఇస్తోందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.శుక్రవారమే ఈ మేరకు చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ నాయక్ ను ఆదేశించారు.
సచివాలయంలో సమీక్ష…
సింగరేణిపై అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశించారు. గతేడాది దీపావళి బోనస్ కన్నా ఈసారి అదనంగా మరో రూ.50 కోట్లు మేర ఇవ్వడం గమనార్హం.
మధ్యాహ్నం కల్లా టిక్ టిక్ మెసేజీలు…
రేపు మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్ను దాదాపుగా 42 వేల మంది కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో కార్మికుడు దాదాపుగా రూ.93,750లను అందుకోనున్నారు.
జాతీయ స్థాయిలో దిల్లీలో చర్చలు…
జేబీసీసీఐ విధానాల్లో భాగంగా బొగ్గు పరిశ్రమ కంపెనీలు సాధించిన ఉత్పత్తి, కార్మికుల శ్రమకు గుర్తింపుగా ఈ ప్రోత్సాహకాన్ని బోనస్ రూపంలో చెల్లిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గత కొన్నేళ్లుగా ఈ పద్ధతి అమల్లో ఉంది. ఈ సారి కూడా ఎప్పటిలాగే కోల్ఇండియా లెవల్ లో కార్మిక సంఘాలు, యజమాన్యంతో చేపట్టిన చర్చల ఫలితంగా బోనస్ ను ఖరారు చేశారు.
33 పర్సెంట్ లాభాల వాటా…
తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఉద్యోగులందరికీ ఈ మధ్యే 33 శాతం మేర లాభాల వాటాను సంస్థ చెల్లించింది. సుమారుగా రూ.796 కోట్లను కంపెనీ అందించిందని సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ వెల్లడించారు. ఈ లెక్కన ఒక్కో కార్మికుడికి సరాసరి రూ.1 లక్షా 90 వేలు అందినట్లు చెప్పుకొచ్చారు.
కాంట్రాక్టు వాళ్లకూ ఈసారి బోనస్ : బలరాం నాయక్, సీఎండీ
ఇక ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికులకు సైతం ఈసారి బోనస్ అందించామన్నారు. ఒక్కోక్కరికి రూ.5 వేల చొప్పున చెల్లించామన్నారు. ఇక దసరా అడ్వాన్స్ కింద ఒక్కొక్క కార్మికునికి రూ.25 వేల చొప్పున దాదాపుగా రూ.90 కోట్లను కంపెనీ ఇచ్చిందన్నారు.
కార్మికుల కోసం రూ.1250 ఖర్చు…
దీపావళి బోనస్ కింద ఒక్కో ఉద్యోగికి రూ.93,450 అందుతాయన్న సీఎండీ బలరామ్, గడిచిన నెల రోజుల్లోనే దీపావళి బోనస్, లాభాల వాటా,దసరా పండుగ అడ్వాన్స్ కింద మొత్తంగా రూ.1250 కోట్లను కంపెనీ ఖర్చు చేసిందన్నారు. దీంతో ఒక్కో ఉద్యోగి ఈనెలలోనే దాదాపుగా రూ.3 లక్షల వరకు అందుకుంటున్నట్లు బలరామ్ నాయక్ వివరించారు.
also read : కథ.. స్క్రీన్ ప్లే.. డైరెక్షన్.. అంతా కేసీఆర్దే!