హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో విద్యుత్ అంతరాయాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇకపై ఎక్కడా పవర్ కట్ లేకుండా ఇందుకు సంబంధించి ప్రత్యేక వాహనాలను తీసుకురానుంది. ఈ ప్రత్యేక వాహనాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు ప్రత్యేక అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై గ్రేటర్ పరిధిలో ఎక్కడ విద్యుత్ అంతరాయం కలిగినా ఈ ప్రత్యేక వాహనాలు తక్షణమే అక్కడికి చేరుకుంటాయి.
ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెను వెంటనే పునరుద్ధరించేందుకు అంబులెన్స్ తరహాలో సెంట్రల్ బ్రేక్ డౌన విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్ లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం . ఇవి 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి.విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేస్తే వెంటనే అత్యవసర సేవల సిబ్బంది అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లు ఉన్నాయి. ప్రతి డివిజన్ కు ఒక వాహనాన్ని కేటాయిస్తున్నాం. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా సేవలను విస్తరిస్తున్నాం.
స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ
ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే తక్షణమే సిబ్బంది అవసరమైన యంత్ర పరికరాలతో పూర్తిస్థాయిలో స్వల్ప వ్యవధిలోనే పునరుద్ధరణ చేపడతారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు. ప్రతి వాహనంలో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపం మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ అవసరమైన అన్ని భద్రతా పరికరాలు.. సాధనాలతో ఈ వాహనం సిద్ధంగా ఉంటుంది.
GAIMS యాప్ అందుబాటులో
ఇంకా ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయి. వాహనాలు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సిబ్బంది వాటిని తక్కువ సమయంలో తరలించడానికి, మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది, TGAIMS యాప్ అత్యవసర ప్రదేశాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. సిబ్బంది అవసరమైన ప్రదేశానికి వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఎమర్జెన్సీ సేవలు
ఈ వాహనాలను విద్యుత్ అంబులెన్సులు అని పిలవచ్చు. ఇవి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీలను అత్యవసరంగా సరిదిద్దడానికి సహాయపడతాయి. తద్వారా వినియోగదారులకు వేగంగా, మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ వాహనాలు దిగ్విజయంగా సేవలు అందించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను’ అన్నారు. ఈ
కార్యక్రమం లో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎండీ లు ముషారఫ్ అలీ , వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.