Bhatti Vikramarka Election Campaign(TS today news): దేశంలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ లో ఖాళీగా ఉన్న సుమారు 30 లక్షల ఉద్యోగాలను ఆగస్టు 15 లోపు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే భర్తీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పంజాబ్ లోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. దేశంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించడంలేదన్నారు. ప్రధాని మోదీ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల ధనాన్ని లాక్కునేందుకు యత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని హమీ ఇచ్చారు.
అనంతరం నిరుద్యోగ సమస్యపై మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగులకు మేలు చేసే విధంగా అప్రెంటిషిప్ హక్కును కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తామన్నారు. దేశంలో డిగ్రీ చేసిన పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారందరినీ ఈ పరిధిలోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది నిరుద్యోగుల ఖాతాల్లో సంవత్సరానికి రూ. లక్ష నగదును జమ చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్, ఆసుపత్రులలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు.
అనంతరంపై ఉపాధి హామీ కూలీల విషయమై మాట్లాడుతూ ప్రధాని మోదీపై ఫైర్ అయ్యారు. గత పదేళ్లలో ప్రధాని మోదీ 25 మందికి సంబంధించిన రూ. లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, ఆ డబ్బుతో 24 ఏళ్లపాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయవచ్చన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు చెల్లిస్తున్న రోజువారి కూలీని రూ. 250 నుంచి రూ. 400 కు పెంచుతామన్నారు. అదేవిధంగా ఆశావర్కర్ల ఆదాయాన్ని కూడా రెట్టింపు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read: యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో పని.. నెలకు రూ. 1.38 లక్షల జీతం!
బీజేపీ ప్రభుత్వం 25 మందిని కుబేరులను చేసిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షాధికారులను చేస్తదని ఆయన భరోసా ఇచ్చారు. అందుకే కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతుందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఆలిండియా సర్వీస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉన్నారనేది చెప్పడంలేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్ ప్రకారం ఆ పోస్టులను కేటాయిస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన అన్నారు.