Mallu Venkateswarlu death news: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు.. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషినల్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వైరా 1వ వార్డులో ఉన్న తన నివాసంలోనే హోమియో ఆస్పత్రిని నిర్వహిస్తూ.. ప్రజలకు వైద్యం అందిస్తూ వచ్చారు. మల్లు వెంకటేశ్వర్లుకు హోమియో వైద్యంలో మంచి పేరుంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుంచీ రోగులు వచ్చేవారు.
Read More : ఔటర్ రింగ్ రోడ్డుపై మెడికో ఆత్మహత్య.. కారణమేంటి ?
మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం.. మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే మూడు రోజుల క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. కాలేయ సమస్య, గుండెపోటు కారణంగా ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాయంత్రం 5 గంటలకు స్వగ్రామమైన లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. భట్టి మరో సోదరుడైన మల్లురవి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి.. ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.