Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీవాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు రాఘవను ప్రవేశపెట్టారు. సౌత్ గ్రూప్ తరుపున చెల్లించిన రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో రాఘవకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ అధికారులు వివరించారు. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ మేరకు వాదనలు విన్న కోర్టు రాఘవకి కస్టడీ విధించింది. ఈడీ అధికారులు కోరినట్లుగానే 10 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. కస్టడీ ముగిశాక రాఘవను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను అదేశించింది.
ఇక ఈ కేసుకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్లో అదుపులోకి తీసుకోగా… పంజాబ్కు చెందిన మద్యం వ్యాపారి, ఒయాసిస్ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ మల్హోత్రాను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్పాల్ ఎదుట గోరంట్ల బుచ్చిబాబును హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. అయితే కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక గౌతమ్ మల్హోత్రాను కూడా అదే రోజు కోర్టులో హాజరుపర్చి కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా.. ఏడు రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మాగుంట రాఘవను కూడా కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.