TS Elections : ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇది ప్రభుత్వ బాధితుల మాట. అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ధీటుగా వందలాది నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు. పైసలు పోయినా మంచిదే కానీ.. గులాబీ అభ్యర్థులను ఓడిస్తామంటూ శపథం చేస్తున్నారు.
ఓవైపు రైతులు.. మరోవైపు రింగ్ రోడ్డు బాధితులు.. ఇంకోవైపు అమరవీరుల కుటుంబాలు. ఇలా ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకమవుతున్నాయి. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడగొడతామంటూ తీర్మానాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలు చేస్తామంటూ.. పోలింగ్కు కొద్దిరోజుల ముందు బీఆర్ఎస్కు షాక్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే రణమే అంటున్నారు. కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయనకు షాక్ ఇచ్చేందుకు ఆ ప్రాంత రైతులు రెడీగా ఉన్నారు. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పై పోటీగా ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు వందమంది పౌల్ట్రీ రైతులు కేసీఆర్ కి వ్యతిరేకంగా నామినేషన్లు వేస్తామంటున్నారు. అటు రైతులు, ఇటు పౌల్ట్రీ రైతులు నామినేషన్లు వేస్తామని ప్రకటించటం పట్ల స్థానికంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లిలో రైతులు ఒక్కటిగా ఉద్యమిస్తున్నారు. చెరుకు రైతుల సత్తా ఏంటో చూపిస్తామంటు కేసీఆర్కు అల్టిమేటం ఇస్తున్నారు. 2014 ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అందుకే నిజామాబాద్ పసుపు రైతులను.. కోరుట్ల చెరుకు రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. కోరుట్లలో ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ సభలోనూ కేసీఆర్ చెరుకు ఫ్యాక్టరీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో స్థానిక రైతుకు చిర్రెత్తుకొచ్చింది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్లు వేసి కవితను ఓడించిన పసుపు రైతులను స్ఫూర్తిగా తీసుకుంటామంటున్నారు. వందకుపైగా నామినేషన్లు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడస్తామని చెబుతున్నారు.
అది అలా ఉండగా.. భువనగిరి ప్రాంత రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మర్చాలని గత కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని రిజినల్ రింగ్ రోడ్డు భూబాధితుల సంఘం నిర్ణయించింది. ఆ సంఘం అధ్యక్షుడు పాండుయాయదవ్.. భువనగిరి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పెడచెవిన పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము బరిలో నిలుస్తున్నట్టు చెబుతున్నారు ట్రిపుల్ ఆర్ రైతులు. ఒక్క పాండు యాదవే కాదు.. అవసరమైతే మరిన్ని నామినేషన్లు వేసేందుకు సిద్ధమని సర్కార్కు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
అమరుల కుటుంబాలకు సహాయం చేయడంలో సర్కారు ఫెయిల్ అయిందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆరోపిస్తోంది. సర్కారు పట్టించుకోకపోవడంతో నిరసనగా ఎన్నికల బరిలో నిలవాలని జేఏసీ లీడర్లు నిర్ణయించారు. తద్వారా అమరుల కుటుంబాల పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట, గజ్వేల్ తోపాటు కామారెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని అమరుల కుటుంబాలు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో బస ఏర్పాటుచేసుకొని ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి.
ఇక మేడ్చల్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థికి కష్టాలు తప్పేలా లేవు. బోడుప్పల్, ఘట్కేసర్లో వక్ఫ్బోర్డు బాధితులు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అవసరమైతే గజ్వేల్కు వెళ్లి మరి వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా..తమ సమస్యకు పరిష్కారం చూపించడం లేదని.. ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్గౌడ్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సాగర్ హిల్స్ లే అవుట్ బాధితులు ఇప్పటికే ఆందోళనలు చేస్తూ తమ గోడును ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు గండ్ర ప్రవీణ్ రావు తమ ఫ్లాట్లను ఆక్రమించి ఊర్జిత బిల్డర్స్ కు డెవలప్మెంట్ కు ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు. 39 ఎకరాల భూమిని కబ్జా చేశారని.. స్పాట్ కి ఎవరూ వెళ్లకుండా గుండాలను పెట్టారని తెలిపారు. న్యాయం చేయకపోతే రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 200 నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు.
.
.