Deccan Mall: సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. నాలుగు రోజుల తర్వాత మంటలు పూర్తిగా చల్లారడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది లోనికి ప్రవేశించారు. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లార్ లో కాలి బూడిదైన మెటీరియల్ ను తొలగించారు.
మరోవైపు మృతదేహాల ఆనవాళ్ల కోసం అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో భవనంలోని అన్ని అంతస్తులను జల్లెడ పట్టారు. అయితే ప్రమాద సమయంలో భవనంలో ఎంత మంది చిక్కుకున్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
డెక్కన్ మాల్ భవనం నాలుగు రోజుల పాటు మంటల్లోనే ఉండటంతో.. బిల్డింగ్ సేఫ్టీపై అనుమానాలు నెలకొన్నాయ్. భవనం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భవనం చుట్టు పక్కల ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు. భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.