Hyderabad: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని డెక్కన్ కార్పొరేట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. దాదాపు మూడు రోజుల పాటు భవనంలో మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షించినప్పటికీ ముగ్గురు వ్యక్తుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. మిగతా ఇద్దరి మృతదేహాలు కూడా దొరకలేదు.
ప్రస్తుతం ఆ భవనాన్ని కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దానిని కూల్చివేయడానికి రూ. 33.86 లక్షల ఖర్చు వస్తుందని అంచనా వేశారు. ఇందుకోసం షార్ట్ టెండర్లను ఆహ్వానించారు. బిడ్లు దాఖలు చేయడానికి గడువు ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముగియనుంది. ఈరోజు సాయంత్రం నిబంధనలకు అనుగుణంగా ముందుకు వచ్చిన ఓ కంపెనీని ఎంపిక చేసి భవన కూల్చివేత పనులను అప్పగించనున్నారు. అయితే భవనం కూల్చివేతకు ఖర్చు చేసిన డబ్బులను బిల్డింగ్ యజమాని నుంచి రకవరీ చేయనున్నారు.
భవనం కూల్చి వేస్తున్న సమయంలో పక్కనున్న భవనాలు దెబ్బతినకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైడ్రాలిక్ క్రషర్ డిమాలిషన్ విధానంలో కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ యంత్రం ఒకే సారి భవనం కుప్పకూలకుండా, పక్కన బిల్డింగ్లకు ఎటువంటి హాని కలగకుండా కూల్చివేస్తుంది.
మరోవైపు ఈ ఘటనపై మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై చర్చించి.. పలు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.