Dengue cases in telangana(Breaking news in telangana): తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా డెంగీ సోకుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు మృత్యువాత పడటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తం అయింది.తెలంగాణ వ్యాప్తంగా ఈ డెంగీ విస్తరించడంతో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసింది.. కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాలలో డెంగీ జ్వరాల తీవ్రతకు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెర్వు మండలానికి చెందిన మూడు సంవత్సరాల చిన్నారి డెంగీ బారిన పడి మృతి చెందాడు. మహబూబాబాద్ కు చెందిన నాలుగేళ్ల హత్విక మంగళవారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే కే సముద్రంలో 34 సంవత్సరాల శిరీష అనే మహిళ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. అలాగే కామారెడ్డి జిల్లాకు చెందిన చౌహాన్ పీరేందర్ అనే 21 ఏళ్ల బీటీెక్ విద్యార్థి , నాగర్ కర్నూల్ కు చెందిన బీటెక్ చదువుతున్న 21 ఏళ్ల నిఖిత కూడా డెంగీ బారిన పడి మృతి చెందింది. సిద్ధిపేటకు చెందిన బానోత్ కిషన్ అనే 47 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు.
వారాల తరబడి జ్వరాలు
గతంలోనూ వైరల్ జ్వరాలు వచ్చేవని..అవి మందులు వేసుకున్నా వేసుకోకున్నా మూడు నాలుగురోజులు మాత్రమే ఉండేవని..ఇప్పుడు పది రోజులవుతున్నా జ్వరాలు తగ్గడం లేదని..పైగా శరీరంలో ప్లేట్ లెట్స్ సంఖ్య కూడా త్వరగా పడిపోతోందని..లక్షలు ఖర్చుపెట్టినా ఫలితం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులనుంచి వృద్ధుల దాకా ఈ జ్వరాల బారిన పడి మృతి చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా దోమలు విజృంభిస్తున్నాయంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శానిటరీ విభాగాన్ని పటిష్టవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వీధులపై ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త. నీటి నిల్వలతో డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను యుద్ధ ప్రాతిపదికన వాటిని నియంత్రించాలని ప్రజలు కోరుకుంటున్నారు.