Current Charges : విద్యుత్తు వినియోగాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర విద్యుత్తుశాఖ స్పష్టం చేసింది. డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో విద్యుత్తును వాడే వారిపై ఛార్జీల మోత మోగించాలని తేల్చి చెప్పింది. 10 కిలోవాట్లకు పైగా డిమాండ్ ఉన్న పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పీక్ సమయంలో కరెంట్ వాడితే సాధారణ చార్జీల్లో 20 శాతానికి తగ్గకుండా చార్జీలు విధించాలని తెలిపింది. గృహ వినియోగదారులకు అయితే సాధారణ చార్జీల్లో 10 శాతానికి తగ్గకుండా చార్జీలు వసూలు చేయాలని విద్యుత్ శాఖ సూచించింది. సౌరవిద్యుత్తు ఉత్పత్తి జరిగే సమయంలో ఉంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విద్యుత్తు వినియోగించే వారికి సాధారణ చార్జీలపై 20శాతానికి పైగా రాయితీతో కరెంట్ ఇవ్వాలని తెలిపింది.
ఇప్పటిదాకా పారిశ్రామిక వినియోగదారులకే వినియోగాన్ని బట్టి చార్జీల విధానం అమల్లో ఉంది. దీన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి గృహ వినియోగదారులందరికీ వర్తింపజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఆయా వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని గుర్తు చేసింది. ఈ మేరకు ఈ నెల 14న ఎలక్ట్రిసిటీ సవరణ చట్టం-2023తో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వినియోగాన్ని బట్టి ఛార్జీల అమలు విధానాన్ని 2024 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం నిర్దేశించింది. వ్యవసాయ వినియోగదారులు మినహా గృహ వినియోగదారులందరికీ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. ఇక సౌర విద్యుత్తు ఉత్పత్తి జరిగే సమయాన్ని ఖరారు చేసే అధికారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి కేంద్రం ఇచ్చింది. ఇక స్మార్ట్ మీటర్లలోనే ఏ సమయంలో విద్యుత్తును వినియోగించాలి? ఏ సమయంలో తగ్గించుకోవాలనే దానిపై సెట్టింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది.