RTC Bill : ఆర్టీసీ బిల్లు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో గవర్నర్ మాట్లాడారు.
టీఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఏఆర్ రెడ్డి, థామస్ రెడ్డి సహా 10 మంది కార్మికసంఘాల నేతలు గవర్నర్తో గంటపాటు చర్చించారు. తమిళిసై తమ సమస్యలు విని సానుకూలంగా స్పందించారని థామస్రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బిల్లుపై ప్రభుత్వ వివరణ అందిన తర్వాత ఆమోదిస్తానని తెలిపారన్నారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నామని థామస్రెడ్డి అన్నారు.
మరోవైపు గవర్నర్ లెవనెత్తిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమాధానమిచ్చింది. పూర్తి వివరాలతో గవర్నర్కు సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. బిల్లు.. TSRTCని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మాత్రమే సంబంధించినదని పేర్కొన్నారు. విభజన సమస్యలు పరిష్కారమయ్యే వరకు కార్పొరేషన్ స్వభావం మారదని తెలిపారు.
ప్రభుత్వంలో చేరిన తర్వాత గత చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
RTC చట్టం, 1950 నిబంధనల ప్రకారం కార్పొరేషన్ బోర్డు అపెక్స్ బాడీగానే ఉంటుందని సీఎస్ లేఖలో వివరించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న ప్రయోజనాలన్ని వర్తిస్తాయన్నారు. ఇండస్ట్రీయల్ డిస్ప్యూట్ చట్టం ప్రకారమే నిబంధనలు వర్తిస్తాయని వివరణ ఇచ్చారు. పెన్షన్, జీతాల విషయంలో అస్పష్టత లేదని పేర్కొన్నారు. అవసరమైన నిబంధనలు నోటిఫికేషన్ ద్వారా రూపొందించడానికి అధికారం ఉందన్నారు. అప్పటి వరకు ప్రస్తుత నియమ, నిబంధనలు వర్తిస్తాయని స్పష్టత నిచ్చారు. జీతాలు, అలవెన్సుల విషయంలో ఏ ఉద్యోగికి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. ప్రస్తుతమున్న కేటగిరీలు, క్యాడర్లను కొనసాగించడానికి అడ్డంకులు లేవని తేల్చిచెప్పారు.
మరోవైపు ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై మరిన్ని వివరణలు కోరారు. ప్రభుత్వం పంపిన వివరణతో సంతృప్తి చెందలేదు. మరిన్ని సందేహాలు వ్యక్తం చేశారు. ఆరు అంశాలపై వివరణలు కోరారు. దీంతో ఆర్టీసీ బిల్లు వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చింది. గవర్నర్ తమిళిసై నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.