Third Phase Rythu Runa Mafi updates(Telangana news): స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా గురువారం రైతులకు మూడో విడత రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా వైరాలో రుణమాఫీకి సంబంధించిన కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీంతో రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో జమ కానుంది.
దక్షిణకొరియాలో పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ చేరుకుంటారు. గురువారం ఉదయం గోల్కోండ కోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఖమ్మం జిల్లాకు సీఎం బయలుదేరుతారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మూడో విడత రుణమాఫీకి సిద్దమైంది. జూలై 15వ తేదీన రుణమాఫీ జీఓ జారీ చేసిన ప్రభుత్వం.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభించింది.
జూలై 18న తొలి విడతలో రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసింది. ఇందులో 11లక్షల 14వేల412 మంది రైతులకు రూ.6,034.97కోట్లు విడుదల చేసింది. జూలై 30వ తేదీన రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ మేరకు రేపు రూ.2లక్షల వరకు మాఫీ చేయనుంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 32.50లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పొంది.
Also Read: విద్యార్థినికి అండగా సీఎం, ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్లో వైద్యం
మూడో విడతలో మొత్తం 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో కలిపి దాదాపు 17.55 లక్షల మంది రైతులకు రూ.12వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.