Crime: ప్రేమ.. ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఒకరంటే ఒకరికి పడకుండా చేసింది. బద్దశత్రువులను చేసింది. చివరికి ప్రాణాలు తీసుకునే వరకు తీసుకొచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ తన స్నేహితుడికి దక్కుతుందోనన్న అనుమానంతో ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
నవీన్, హరి అనే ఇద్దరు స్నేహితులు హైదరాబాద్ నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే వారిద్దరూ ఒకే అమ్మాయిపైన మనసు పారేసుకున్నారు. ఇద్దరూ ఆమె కోసం ప్రాణాలిచ్చే వరకు వెళ్లారు. ఈక్రమంలో వారిద్దరి మధ్యలో కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. అమ్మాయి నాదంటే.. నాదంటూ పలుమార్లు కాలేజీలో గొడవ కూడా పడ్డారు.
ఈక్రమంలో నవీన్ను ఎలాగైనా తప్పించాలని హరి అనుకున్నాడు. ఓ పథకం పన్ని.. ఈ నెల 17న పార్టీ చేసుకుందామని నవీన్ను తన స్నేహితుడి రూమ్కి పిలిచాడు. ఈక్రమంలో మరోసారి గొడవ చోటుచేసుకుంది. దీంతో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అయితే శంకరయ్య హరితో మాట్లాడడంతో గొడవ సద్ధమణిగింది.
ఆ తర్వాత నాలుగు రోజులు గడిచిపోయింది. నవీన్ కాలేజీ వెళ్లలేదు.. ఇంటికి కూడా వెళ్లలేదు. కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.
ఇంతలోనే షాక్.. హరి అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నవీన్ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఎక్కడ నవీన్కు దక్కుతుందనే కోపంతో కొట్టి చంపానని పోలీసులకు వివరించాడు. పార్టీ అయిపోయాక విచక్షణారహితంగా కొట్టి మృతదేహాన్ని హైదరాబాద్-విజయవాడ హైవే పక్కన పడేశానని తెలిపాడు. దీంతో పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు. విషయం తెలిసి నవీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.