Crime News : ఈజీ మనీ ఎప్పటికైనా డేంజరే. ఎన్ని ఘటనలు జరుగుతున్నా.. మళ్లీ ఎక్కడో ఒకదగ్గర ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. చిన్న పనికే పెద్ద మొత్తం లాభం వస్తోందంటే.. అందులో ఏదో తిరకాసు ఉన్నట్టే.
లేటెస్ట్ గా హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగుచూసింది. చాలా ఈజీగా ఉందా ఫ్రాడ్. బిజినెస్ పేరుతో విసిరిన ట్రాప్ లో.. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మందికి పైగా మోసపోయారు. ఇంతకీ అదేంటంటే…
సింపుల్. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. జస్ట్ దీపం వత్తులు, బొట్టు బిళ్లలు తయారు చేయడమే. కాకపోతే వాటిని తయారు చేసే మిషన్ ను వాళ్ల దగ్గరే కొనాలి. దీపం వత్తుల మెషిన్ అయితే ఒక్కోటి 1.70 లక్షలు. అదే బొట్టు బిళ్లలు తయారు చేసే మెషిన్ అయితే 1.40 లక్షలు.
వాటిని కొనుక్కొని.. వాటితో వత్తులు, బొట్టు బిళ్లలు తయారు చేస్తే.. కిలోల లెక్కన తిరిగి వాళ్లే కొంటారు. ముడి సరుకు కూడా వాళ్లే ఇస్తారు. జస్ట్ వత్తులు, బిళ్లలు చేసిస్తే చాలు. కిలో వత్తులకు 300, కిలో బొట్టు బిళ్లలకు 600 ఇచ్చేలా బిజినెస్ డీల్ సెట్ చేశారు.
లక్షల్లో డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపించి.. 1100 మందితో అలా మెషిన్లు కొనిపించారు. అంతా, కిలోకు ఎంత వస్తుందనే లెక్కే వేశారు కానీ.. లక్షన్నర పెట్టి మెషిన్ కొంటున్నామనే విషయం మర్చిపోయారు. తెలిసిన వారు చెబితే కొందరు, యూట్యూబ్ వీడియోలు చూసి మరికొందరు.. అలా ఏడాదిలోనే వెయ్యి మంది ఆ మెషిన్లు కొనేశారు.
కంపెనీకి వందల కోట్ల డబ్బు వచ్చిపడింది. ఇంకేం.. సడెన్ గా జెండా ఎత్తేశారు. అప్పుడుగానీ బాధితులకు తెలీలేదు తాము మోసబోయామని. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఇదంతా చేసింది ఒక్కడే. ఏఎస్రావునగర్లో ఉండే రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. అతగాడి మోసం విలువ 200 కోట్లుగా లెక్కేశారు పోలీసులు.