CPI Narayana | ఈసారి తెలంగాణ ఎన్నికలలో ఓడిపాతామనే భయం కేసీఆర్కు పట్టుకుందని అందుకే కేసీఆర్, కేటీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు యత్నిస్తున్నారని సీపీఐ సీనియర్ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ చంద్రబాబు అందుకు ఒప్పు కోలేదన్నారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలపేటలో మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎన్నికల ప్రచారంలో సిపిఐ నారాయణ పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్, కేటీఆర్ తీరు అందరూ చూశారన్నారు. ఇప్పుడేమో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లకోసం చంద్రబాబుని కలిసేందుకు కేసీఆర్ ఎదురుచూస్తున్నారని సీపీఐ నారాయణ తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం వల్లే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని నారాయణ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడంతో కేసీఆర్కు డాటర్ స్ట్రోక్ తగిలిందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో తులసి మొక్కకు గంజాయి మొక్క మధ్య పోటీ ఉందని.. తుమ్మల తులసి మొక్క లాంటోరని అన్నారు. పువ్వాడ అజయ్ ఒక గంజాయి మొక్క లాంటోడని.. అలాంటి పువ్వాడకు సీపీఐ పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా పడదని స్పష్టం చేశారు. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు రాలేట్టుగా.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు చెంపపెట్టు అని సీపీఐ అగ్రనేత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లే కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణలో కూలిపోతుందన్నారు.
నిండా అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిందని.. కానీ కేసీఆర్ కుటుంబం ఖజానా మాత్రం నిండిందని విమర్శించారు. రాజకీయం కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చారే తప్ప రైతులపై ప్రేమతో కాదన్నారు. అంత అవినీతి జరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు పదేళ్లుగా కేసీఆర్ని అరెస్టు చేయలేదని నిలదీశారు. మోదీ, కేసీఆర్, జగన్ ముగ్గురూ దొంగలే అని విమర్శించారు.
యువత, రైతులు, మహిళలు, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. అహంభావంలో కేసీఆర్, కేటీఆర్ తరువాత పువ్వాడ అజయ్ అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని నారాయణ తెలిపారు.