Congress – CPI : కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తుపై సందిగ్ధతకు నేడు తెరపడనుంది. జాతీయస్థాయిలో సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారైనట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సుదీర్ఘ చర్చల అనంతరం.. సీపీఐ పొత్తుకు అంగీకరించిందని సమాచారం. కొత్తగూడెం టికెట్ తో పాటు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. వీటితో పాటు.. మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేయాలని రెండుపార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడంతో.. ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయించారు. అలాగే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సైతం కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా సీపీఐ కూడా కాంగ్రెస్ తో కలుస్తుండటంతో.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటు బీఆర్ఎస్ కు పెద్ద మైనస్. ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రాలుగా మారాయి. లక్షకోట్ల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో సొమ్ముచేసుకుందన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ కు సీపీఎం కటీఫ్ చెప్పి.. ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించేసింది. అంతేకాదు.. ఏకంగా 17 స్థానాల్లో పోటీ అంటూ.. ఫస్ట్ లిస్ట్ ను కూడా ప్రకటించేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో సీపీఎం పోటీ చేయనుంది. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకలు, భువనగిరి, హుజూర్ నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్ చెరు, ముషీరాబాద్ స్థానాల నుంచి కూడా సీపీఎం పోటీ చేయనుంది. కానీ.. ఇంతవరకూ ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.