TS MLC By Election updates(Political news in telangana): నల్లగొండ – వరంగల్ – ఖమ్మం శాసనమండలి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లి గోదాంలో ఓట్లను లెక్కిస్తున్నారు. నాలుగు రౌండ్లలో మొత్తం 96 వేల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. నాలుగు హాళ్లు, 96 టేలుళ్లపై ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా 72.44 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. అర్ధరాత్రి లోపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముందని భావిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానున్నది.
కాగా, రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ మే 13న నిర్వహించగా, జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది, కాంగ్రెస్ అభ్యర్థులు 8 మంది విజయం సాధించగా, మిగతా ఒక్క సీటు ఎంఐఎం ఖాతాలో పడింది. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సంబరాలు జరుపుకుంటున్నాయి. అదేవిధంగా దేశంలో కూడా ఎన్డీఏ కూటమి అధిక సీట్లను సాధించిన విషయం తెలిసిందే. ఇండియా కూటమికి కూడా భారీగానే సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నది. పలు పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు పిలిస్తే వెళ్తా: సీఎం రేవంత్ రెడ్డి
ఇటు ఏపీలో కూడా కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుంది. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమిలో భాగమైనటువంటి జనసేన పార్టీ చరిత్ర సృష్టించింది. 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచింది. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలను సైతం కైవసం చేసుకుంది. ఇటు టీడీపీ కూడా అధిక సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 8 సీట్లలో గెలిచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.