గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన శాఖలో అవినీతి బాగోతం బయటపడింది. కాంట్రాక్టుల పేరుతో అడ్డగోలుగా చేసిన దోపిడీ వెలుగులోకి వచ్చింది. గతంలో ఆయన అనుచరులు చెప్పిన వారికే కాంట్రాక్టులు దక్కినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టులు ఎవరికి దక్కినా.. పనులు చేసింది మాత్రం మాజీమంత్రి అనుచరులేనని ధ్రువీకరించారు. నాసిరకం పనులు చేసి కోట్లు దోపిడీ చేసినట్లు తెలుస్తోంది.చేసిన పనులే మళ్లీ చేసిన అక్రమార్కులు.. బిల్లులు పెట్టుకుని వాటిని డ్రా చేసుకున్నట్లు సమాచారం. పట్టణప్రగతి నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, ఇతర పర్మిషన్లలో మాజీమంత్రి అనుచరులు చేతివాటం చూపించారు. బిడ్డింగ్, టెండర్లు లేకుండానే కట్టబెట్టిన కాంట్రాక్టుల వెనుక ఎవరున్నారో నివేదిక ఇవ్వాలని తాజాగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు సంవత్సరాలలో ఒక్కో పనిని.. నాలుగుసార్లు మాజీమంత్రి అనుచరులు చేసినట్లు సమాచారం. తెలంగాణలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీల్లో మాజీమంత్రి అనుచరుల దందా చేసినట్లు తెలుస్తోంది.
HMDA పరిధిలో మాజీమంత్రి అనుచరులు చెప్పిన వారికే పనులను అధికారులు అప్పగించినట్లు సమాచారం. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ లంచాలు దండుకున్న అధికారుల పాత్రపై ఇంటెలిజెన్స్ నివేదిక కోరింది. సుమారు 5 వేల కోట్ల కమీషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది.