Rahul Gandhi Kamareddy | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
సభలో రాహుల్ మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే ప్రజాధనం దోచుకోవడానికి జరిగింది. నేను స్వయంగా వెళ్లి డ్యామ్ చూశాను. కొన్నేళ్ల క్రితం కట్టిన డ్యామ్ పిల్లర్లలో పగుళ్లు వచ్చాయి. పిల్లర్లు కృశింపోయాయి. కేసీఆర్ కంప్యూటరైజేషన్ గురించి మాట్లాడుతారు. కాంగ్రెస్ హయంలో హైదారాబాద్ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చాము. కానీ కేసీఆర్ మాత్రం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల భూమిని అన్యాయంగా తీసుకొని.. తన మిత్రులకు అప్పగించారు.
కేసీఆర్ హయాంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు సంపాదించడానికి భూమి, మద్యం, ఇసుక ద్వారా కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3 లక్షలు లంచం తీసుకుంటున్నారు. తెలంగాణ యువత ఎంతో కష్టపడి డబ్బులు కట్టి కోచింగ్ తీసుకొని.. పరీక్షలు రాస్తే వారికి ఉద్యోగాలు రావడం లేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం పేపర్ లీకులు చేసి తన బంధు మిత్రులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తోంది. కేసీఆర్ నడిచే రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఆయన చదువుకున్న పాఠశాల, కాలేజీలను కాంగ్రెస్ ప్రభుత్వ నిర్మించినవే. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే.
ప్రధాని మోదీ పార్లమెంటులో నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక సాగు చట్టాలు లాంటి ఏ ప్రజా వ్యతిరేకమైన చట్టాలు చేసినా కేసీఆర్ పార్టీ వాటిని మద్దతు తెలుపుతుంది. నేను మోదీ వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను లోక సభ సభ్యత్వాన్ని రద్దుచేశారు, నాపై 24 కేసులు పెట్టారు. మరి కేసీఆర్ తెలంగాణ లక్షల కోట్లు దోచుకుంటూ అవినీతి చేస్తుంటే మోదీ ప్రభుత్వం ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టదు. అలాగే ఎంఐఎం కూడా బీజేపీ కోసం పనిచేస్తోంది.ఎంఐఎం ఎప్పుడూ కాంగ్రెస్ వ్యతిరేకంగానే పనిచేస్తుంది. బిజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ను ఓడించడానికి కలిసి పనిచేస్తున్నాయని,” ఆరోపణలు చేశారు.
“అలాగే బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఎంత డబ్బులు ప్రజల నుంచి దోచుకున్నాయో.. ఆ డబ్బులన్నీ తిరిగి ప్రజల జేబుల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వ నింపుతుంది. అందుకే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ హామీలన్నీ అమలు పరుస్తాం. కాంగ్రెస్ గెలిస్తే ప్రతి మహిళకు రూ.2500 ఇస్తాం, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం, ఇవన్నీ కాంగ్రెస్ గెలిచిన తరువాత వెంటనే చేస్తుంది. రూ.15000 ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకంతో రైతన్నలకు ఇస్తాం, రూ.12000 ప్రతి సంవత్సరం ప్రతి తెలంగాణ కూలీలకు కాంగ్రెస్ ఇస్తుంది, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తాం, ఇల్లులేని ప్రతి తెలంగాణ వాసికి రూ.5 లక్షలు ఇస్తాం, తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు 250 చదరపు అడుగుల స్థలం కేటాయిస్తాం. వృద్ధులకు, వికలాంగులకు ప్రతి సంవత్సరం రూ.4000 ఇస్తాం. కాంగ్రెస్ గెలిస్తే ప్రజల తెలంగాణ వస్తుంది. అందుకే ప్రజలందరూ భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికే అన్ని ఓట్లు పడాలి. ఒక్క ఓటు కూడా బిఆర్ఎస్కు వేయకూడదు,” అని అన్నారు.