Mayor Kavya : బీఆర్ఎస్కు అవిశ్వాసాల తీర్మానాలు తలనొప్పిగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ నగరపాలక సంస్థలో మేయర్ మేకల కావ్యపై పలువురు కార్పొరేటర్లు మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 19 మంది మేయర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేడ్చల్ కలెక్టర్కు తెలియజేశారు.
రాజకీయ ఒత్తిళ్లు, అసెంబ్లీ ఎన్నికలు తదితర కారణాలతో తీర్మానం వాయిదా పడింది. ఈ అంశంపై కార్పొరేటర్లు ఇటీవలే కలెక్టర్ను కలిశారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తాజాగా కలెక్టరేట్ నుంచి కార్పొరేషన్కు సంబంధిత ఆదేశాలు అందాయి. దీంతో మరో 2 రోజుల్లో అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. అవిశ్వాసం ఇచ్చిన 19 మంది కార్పొరేటర్లతో పాటు మరొకరు ఏపీలోని బాపట్లకు విహారయాత్రకు వెళ్లారు.
నిధుల కేటాయింపులో తమను సంప్రదించకుండా మేయర్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. పరిస్థితిని సరిదిద్దేందుకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇటీవల కొంతమందిని విహారయాత్రకు తీసుకెళ్లారు. అయినా ఎటువంటి ఫలితం రాలేదు. మేయర్ కావ్య కార్పొరేటర్లను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన కార్పొరెటర్లు త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నారని సమాచారం. జవహర్ నగర్ నగర పాలక సంస్థలో మేయర్ మేకల కావ్య సహా మొత్తం 28 మంది సభ్యులున్నారు.