Covid: కరోనా. ఈ పేరు వింటేనే చాలు ఉలిక్కిపడే పరిస్థితి. ఇప్పుడంటే అంతా లైట్ తీసుకుంటున్నారు కానీ.. రెండేళ్ల క్రితమైతే కొవిడ్ అంటే వణికిపోయేవారు. మధ్యమధ్యలో అప్పుడప్పుడూ ఎన్నోకొన్ని కేసులు వచ్చిపోతున్నా.. ఇప్పటి వరకైతే గతంలోలా సీరియస్ ప్రాబ్లమ్ రాలేదు. కానీ….
మన పక్కనే ఉన్న చైనాలో విపరీతమైన కేసులు. కరోనా ముంచేయడంతో చైనీయులు బేజారు. లాక్ డౌన్ లేకున్నా అక్కడంతా నిర్మానుషం. రోజూ వేలు, లక్షల్లో కేసులు వస్తున్నాయి. కరోనా టెస్టింగ్ కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. చైనా మాత్రమే కాదు జపాన్, కొరియా, బ్రెజిల్, అమెరికాలోనూ కొద్దికొద్దిగా కేసులు పెరుగుతున్నాయి. వారానికి 35 లక్షల వరకూ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తుండటంతో భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ లేఖలు రాసింది.
కరోనా కేసులపై అన్నిరాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం సూచించింది. కొత్త వేరియంట్లతో జాగ్రత్త అని.. ఉదాసీనంగా ఉంటే.. రెండేళ్ల కిందటి పరిస్థితులు రావొచ్చంటూ కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలో హెచ్చరించింది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్రాలకు సూచించింది.
మళ్లీ కరోనా అనే వార్తలతో జనాలు ఉలిక్కిపడుతున్నారు. గతాన్ని గుర్తు చేసుకుని బెంబేలెత్తిపోతున్నారు. మూలకు పడేసిన మాస్కులను మళ్లీ బయటకు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకైనా మంచిదని.. మూడో డోసు కొవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. దేవుడా.. మళ్లీ కరోనా రాకుండా చూడు స్వామీ అంటూ మొక్కుతున్నారు.