Congress: కప్పల సామెత ఒకటుంటుంది. ఓ కప్ప పైకి ఎగరాలని ప్రయత్నిస్తుంటే.. మిగతా కప్పలు పైకెక్కే కప్ప కాలు పట్టుకుని వెనక్కి లాగేస్తుంటాయట. ఈ కప్పల సామెత తెలంగాణ కాంగ్రెస్ కు సరిపోతుందని అంటున్నారు. పార్టీలో జోష్ నింపేలా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయం చేస్తుంటే.. ఆయన ముందరి కాళ్లకు బంధాలు వేసేలా.. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూను రాజేస్తూనే ఉన్నారు.
ఇన్నాళ్లూ కమిటీల పేరుతో కాంగ్రెస్ సీనియర్లు రచ్చ రచ్చ చేశారు. అదికాస్త సద్దుమనిగిందని అనుకునేలోగా.. ఈసారి రేవంత్ రెడ్డి పాదయాత్ర మీద పడ్డారు. జనవరి 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతుండగా.. పాదయాత్ర డ్యూరేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేత, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదంటూ కొత్త ఇష్యూను తెరమీదకు తీసుకొచ్చారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యులర్ లో 2 నెలల పాదయాత్ర అని మాత్రమే ఉందని.. కానీ పీసీసీ మాత్రం జనవరి 26 నుంచి 5 నెలల పాటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని ప్రకటించడమేంటని మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. రేవంత్ ఏదో పాదయాత్ర చేస్తానంటున్నారు.. చేయనీయొచ్చుగా.. అభ్యంతరం ఎందుకు? కావాలనే ఆయన పాదయాత్రపై కొర్రీలు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు రేవంత్ వర్గీయులు.
అసలు పీసీసీ పాదయాత్ర చేయాలనే లేదంటూ కొత్త లాజిక్ తీసుకొచ్చారు మహేశ్వర్ రెడ్డి. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ సర్క్యులర్ లో పీసీసీ పాదయాత్ర చేయాలని లేదని, నియోజకవర్గ స్థాయిలో బ్లాక్ ల వారీగా పాదయాత్ర నిర్వహించాలని.. ఆ పాదయాత్రలో పీసీసీ స్థాయి నుంచి సీనియర్ నాయకులంతా హాజరు కావాలని మాత్రమే ఉందన్నారు మహేశ్వర్ రెడ్డి. ఏఐసీసీ వచ్చిన సర్క్యులర్ ఒకలా ఉంటే రేవంత్ రెడ్డి మరోలా చెబుతున్నారంటూ మహేశ్వర్ రెడ్డి మంట రాజేస్తున్నారు.
సీనియర్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అంత ఈజీగా వదిలేలా లేరు. బుధవారం హైదరాబాద్ లో జరిగే.. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ శిక్షణా తరగతులకు సీనియర్లంతా హాజరుకావాల్సి ఉంది. మరి, వారు వస్తారా? లేదా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
ఇదే డౌట్ హైకమాండ్ కు సైతం వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిదని అనుకున్నారేమో.. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. శిక్షణ తరగతులకు సీనియర్లంతా వెళ్లాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన నివేదికను పరిశీలించామని.. పార్టీ అంతర్గత సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఖర్గే ఫోన్ కాల్ తోనైనా సీనియర్లు ఆ సమావేశానికి హాజరవుతారా? లేదంటే రచ్చ కంటిన్యూ చేస్తారా?