నిజామాబాద్, స్వేచ్ఛ: సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సదర్భంగా పలు అంశాలపై స్పందించారు. వీలైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. దసరా కానుకగా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్న మహేష్ గౌడ్, మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా ఇస్తున్నామని చెప్పారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందన్నారు. కానీ, కేసీఆర్ హయాంలో అవి నెరవేరలేదని విమర్శించారు.
Also Read: తెలంగాణలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మొదటిసారి: కిషన్ రెడ్డి
50వేల ఉద్యోగాలిచ్చాం
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50 వేల వరకు ఉద్యోగాలు కల్పించామని, అదే కేసీఆర్ పదేళ్ల పాలనలో 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని, పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత, కాంగ్రెస్ 9 నెలల్లో ఇచ్చిన రుణమాఫీ ఎంత అని ప్రశ్నించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఇచ్చారని, అయినా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మహేష్ గౌడ్. ఇది తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా బీఆర్ఎస్కు నష్టం తప్పదని హెచ్చరించారు.
ఎంపీ అరవింద్కు సూచన
జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై త్వరలోనే సీఎంతో చర్చిస్తానని, ప్రాణహిత 20, 21వ ప్యాకేజీ పనులు వేగవంతం చేయిస్తామని చెప్పారు. జిల్లాకు మెడికల్ కళాశాల ఆవశ్యకత ఉందన్న టీపీసీసీ చీఫ్, మంచి స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఆర్ఓబీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిజామాబాద్కు స్మార్ట్ సిటీ రావల్సిన అవసరం ఉందన్న మహేష్ గౌడ్, బీజేపీ ఎంపీ అరవింద్ దీనిపై కృషి చేయాలని సూచించారు.
హైడ్రాపై తగ్గేదే లే
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మహేష్ గౌడ్. గత పదేళ్ళలో యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ను ఎవరూ నమ్మరని, అసలు ఆపార్టీకి పోటీ చేసే అర్హతే లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలిచ్చిందని, హైడ్రా, మూసీ ప్రక్షాళన నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఆ పరిధిలో తనతో సహా ఎవరున్నా చర్యలు తప్పవన్న ఆయన, హైడ్రా అంశంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన మీద కేటీఆర్, హరీష్, కిషన్ రెడ్డిలవి చిల్లర మాటలని, ఇది ఆపేస్తే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: బిర్యానీలో ప్రత్యక్షమైన జెర్రీ.. కంగుతిన్న కస్టమర్.. ఇదేంటని హోటల్ సిబ్బందిని అడిగితే…
స్థానిక ఎన్నికల్లో స్ట్రాటజీ
చెరువులు, ప్రభుత్వ భూములు అక్రమంగా అమ్మిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్. పేద ప్రజలను మోసం చేస్తే సహించబోమని, వారిని ఆదుకునే ఆలోచనలో ఉన్నామన్నారు. బాన్సువాడ, వరంగల్, పరకాల లాంటి ప్రాంతాల్లో నేతల మధ్య విభేదాలు సరిదిద్దుతామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటానికి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం సహా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోపనున్నామని, కాంగ్రెస్ పాలనను వివరిస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.