Congress vs BRS : ఇందిరమ్మ రాజ్యం అంటే కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారు. ఆమె చేసింది ఏంటని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ రివర్స్ ఇంజినీరింగ్లో మేడిగడ్డ ప్రాజెక్టు నాలుగేళ్లకే కుంగిపోగా.. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 50 ఏళ్లైనా చెక్కుచెదరలేదు. డబుల్ బెడ్ రూమ్ అంటూ మాటలకే పరిమితం అవగా.. హస్తం పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు పేదలకు గూడుగా మారాయి. హైదరాబాద్లోని BHEL వంటి భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొలువు దీరాయంటే అది ఇందిరమ్మ ఫలితమే.. మరి రాజకీయాల్లో నేడు కేసీఆర్ ఉన్నారంటే.. అందులోనూ ముఖ్యమంత్రి అయ్యారంటే అది ఇందిరమ్మ, సోనియా గాంధీ చలవేనని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి గట్టిగా బదులిస్తున్నారు.
ఇందిరమ్మ రాజ్యంపై పేలుతున్న మాటల తూటాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందరిమ్మ రాజ్యం తీసుకువస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి భరోసా ఇస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంతోనూ ఇందిరమ్మకు అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. మెదక్ నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ ఇక్కడి ప్రజల ఆదరణ పొందారని ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఇక్కడి ప్రజలతో తమది కుటుంబ బంధమని నానమ్మ నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇవన్నీ కంటగింపుగా భావిస్తున్న గులాబీ బాస్ సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవుతుందో అనే అక్కసు ప్రదర్శిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే అవమానించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు. దీనికి పీసీసీ చీఫ్ రేవంత్ గట్టిగానే బదులిస్తన్నారు.
దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పేదలకు కూడు, గూడు అందేలా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన BHEL వంటి పరిశ్రమలు నెలకొల్పారు. ప్రస్తుతం తెలంగాణలోని మారుమూల పల్లెల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిలువ నీడనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. గిరిజనులు, దళితులు, పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచి ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసింది. 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. నాగర్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు కల్పించింది. హైదరాబాద్లో ఓఆర్ఆర్, ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు సౌకర్యం, ఐటీ, ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనని కేసీఆర్కు.. గట్టిగా బదులిచ్చారు రేవంత్రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోతే కేసీఆర్ ఫ్యామిలీ అడుక్కుతినేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్సేనని కాంగ్రెస్ బలపరిస్తేనే సిద్దిపేటలో కేసీఆర్ సింగిల్ విండో డైరెక్టర్ అయ్యారని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది ఇందిరమ్మ కుమారుడు సంజయ్ గాంధీ అని గుర్తు చేశారు.
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గరీభీ హఠావో అనే నినాదంతో తనదైన ముద్ర వేశారు. పేదరికాన్ని పారదోలాలనే ఉక్కు సంకల్పంతో ఇందిరా గాంధీ దేశానికి సేవలు అందించారు. అందుకే ఇప్పటికీ పేదలకు ఏదైనా న్యాయం జరిగిందంటే ఆమె హయాంలోనే అని చెబుతారు. అందుకే కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఉలిక్కి పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఇందరమ్మ తరహాలోనే ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇస్తోంది.
.
.