కాంగ్రెస్ పార్టీ 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. కామారెడ్డి నుంచి రేవంత్రెడ్డి బరిలోకి దిగనున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, నారాయణ ఖేడ్ నంచి సురేష్ షెట్కర్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ 100 మంది పేర్లతో 2 విడతలుగా పేర్లు ప్రకటించింది. అయితే అందులో 97 మందికే బీ ఫామ్ ఇచ్చింది. వనపర్తి, బోథ్, చేవెళ్ల స్థానాలపై పునరాలోచనలో పడింది. మరోసారి పేర్లు పరిశీలించి మూడో జాబితాలో బీ ఫామ్లు నిలిపివేసిన బోథ్, వనపర్తి అభ్యర్థులను కొత్తగా ప్రకటించింది. చేవేళ్ల అభ్యర్థిపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది.
తాజా జాబితాలో బోథ్ నుంచి ఆడె గజేందర్, వనపర్తి నుంచి తూడి మేఘారెడ్డి బరిలో దిగనున్నారు. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్ కు చెన్నూర్ స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. ఇక జుక్కల్ లో తోట లక్ష్మీకాంతరావు బరిలో ఉండనున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డిను ఢీకొట్టనున్నాడు.
ఇక కరీంనగర్ నుంచి పురుమళ్ల శ్రీనివాస్ బరిలో దిగనున్నారు. సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి.. కేటీఆర్ పై పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నీలం మధు ముదిరాజ్ కు పటాన్ చెరు స్థాన్నాన్ని కేటాయించింది. ఎస్టీ రిజర్వుడు స్థానాలైన డోర్నకల్ నుంచి జాటోతు రామచంద్రునాయక్.. ఇల్లందు నుంచి కోరం కనకయ్య.. వైరా నుంచి మాలోత్ రాందాస్.. అశ్వారావుపేట నుంచి జారే ఆదినారాయణ బరిలో దిగనున్నారు. ఇక సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి పోటీ చేయనున్నారు.
ఈ జాబితాతో మొత్తంగా 114 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాలైన మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎం ఒంటరిగానే బరిలో దిగుతుంది అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం తెలిపిన విషయం తెలిసిందే. అయినా మిర్యాలగూడ స్థానంపై సస్పెన్స్ వీడలేదు. ఇక సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తుంగతుర్తి టికెట్ పొందడానికి చాలామంది ఆశావహులు ఎదురుచుస్తున్నారు. చార్మినార్ స్థానాన్ని కూడా అధిష్ఠానం హోల్డ్ లో పెట్టింది. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకు కేటాయించారు.